2019 నుంచి 2024 వరకు చెలరేగిపోయిన వైసీపీ నేతల విషయంలో.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిపై టిడిపి క్యాడర్ చాలా ఆశగా ఎదురుచూస్తోంది. దాదాపు 7, 8 నెలల నుంచి దీనిపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అప్పట్లో నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. టిడిపి కార్యకర్తలు కూడా రెడ్ బుక్ విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది రెడ్ బుక్ అనే కామెంట్స్ కూడా చాలా వరకు వినిపించాయి.
Also Read : చింతమనేనిపై రాడ్లతో దాడి.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే
మొన్నటివరకు వైసీపీ కార్యకర్తలను.. లేదంటే సోషల్ మీడియాలో హడావుడి చేసిన వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు మాత్రం నాయకులు పై దృష్టి సారించారు. ఇప్పటికే ముగ్గురు నలుగురు నాయకులు జైలుకు వెళ్లి బయటికి వచ్చారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు జైలుకు వెళ్లి బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు రెడ్ బుక్ లో అత్యంత కీలకమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకు వెళతారా?? లేదా..? అనేదానిపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : వైసీపీలో 14 రోజుల భయం.. వంశీ ఇప్పట్లో కష్టమే..?
ఆయన చేసిన అక్రమాలపై ఎన్నో కథనాలు మీడియాలో వచ్చాయి. అయినా సరే ఇప్పటివరకు ఆయన విషయంలో పోలీసులు గానీ.. ఇతర వ్యవస్థలు గాని దూకుడు ప్రదర్శించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇక మరో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు ఆయనపై ఇప్పటివరకు మూడు కేసులు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో ఆయనను ఏదో ఒక కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తాజాగా వల్లభనేని వంశీని అరెస్టు చేయడంతో ఇక నేతల వంతు వచ్చిందని.. త్వరలోనే మరికొంతమంది కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు టిడిపి కార్యకర్తలు. మరి రెడ్ బుక్ లో కీలకంగా ఉన్న ఇతర నేతల విషయంలో ఏం చేస్తారో చూడాలి. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలపై కూడా అప్పట్లో తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వాళ్ళు ప్రస్తుతానికి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. చంద్రబాబుని అత్యంత దారుణంగా విమర్శించిన వాళ్ళలో ద్వారంపూడి కూడా ఒకరు. మరి వీళ్లను అరెస్టు చేస్తారా లేదా అనేది చూడాలి.