ఏపీలో అధికారుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. సమర్ధవంతమైన అధికారుల వైపు చూస్తున్న ఏపీ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపిఎస్, పోలీసులపై ఎక్కువ ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా లేని అధికారులను బదిలీలు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మంత్రుల పేషీలలో ఉన్న అధికారులను కూడా బదిలీలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఒకటి, రెండు రోజుల్లో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయని తెలుస్తోంది.
Also Read : ఎస్.. రెడ్ బుక్ కోసమే పోలీసులు పని చేస్తారు
దాదాపు 10 మంది కలెక్టర్లకు స్థానచలనం కలిగే అవకాశముందని భావిస్తున్నారు. అందులో 8 మంది వరకూ కోస్తా జిల్లాల కలెక్టర్లే ఉండనున్నారని, ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా, ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా జిల్లాల్లోని నలుగురైదుగురు కలెక్టర్లు బదిలీ అవుతారని వార్తలు వస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లోని ఓ కలెక్టర్ను అత్యంత ప్రాధాన్యమున్న గుంటూరు జిల్లాకు మార్చే అవకాశముందని తెలుస్తోంది. వీరితో పాటు క్రియాశీలకంగా వ్యవహరించని, వివాదాస్పదమవుతున్న కొందరు సీనియర్ అధికారులనూ ప్రభుత్వం బదిలీ చేయనుంది.
Also Read : బ్రేకింగ్: మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
ఇక సచివాలయంలో ఉన్న అధికారులను సైతం బదిలీ చేసేందుకు సిద్దమవుతోంది. విద్యా శాఖ, పంచాయితీ రాజ్ శాఖల్లో కీలక అధికారులను మార్చే సంకేతాలు కనపడుతున్నాయి. మార్పులు, చేర్పుల్లో భాగంగా 5-10 మంది వరకూ వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు బదిలీ కానున్నారని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సీఎంవోలోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశముందని భావిస్తున్నారు. మొత్తంగా 20-25 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ కావొచ్చని అంచనా వేస్తున్నారు. నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి.