ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగిన మైనింగ్ మాజీ ఎండీ వెంకట రెడ్డి ఏసీబీ కస్టడీలో పలు కీలక విషయాలను వెల్లడించినట్టు సమాచారం. గురువారం ఆయన్ను దాదాపు 5 గంటల పాటు అధికారులు విచారించారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది విచారణ. ఇసుక టెండర్ల వ్యవహారం పై ప్రశ్నించిన ఎసిబి… గనుల శాఖలో లీజు అక్రమాలు, అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రశ్నలు సంధించింది. బిల్లులు చేతిరాతతో ఎందుకు ఇచ్చారని ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ విచారణలో తన తప్పేమీ లేదని ఆయన చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
ఏసీబీ విచారణలో పలు ఆసక్తికర అంశాలను వెంకట్ రెడ్డి ప్రస్తావించారు అని సమాచారం. ఇసుక టెండర్ల వ్యవహారంలో ఎక్కడ నా ప్రమేయం లేదు గత ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే చేశాను అని చెప్పారట. వారిని ధిక్కరించే పరిస్థితి లేదు… గత్యంతరం అంతకంటే లేకపోవడంతో చేశాను అని వెంకట రెడ్డి చెప్పడం గమనార్హం. ఎవరా పెద్దలు అనేదానికి మాత్రం వెంకటరెడ్డి సమాధానం చెప్పలేదు. ప్రభుత్వానికి 100 కోట్లు బాకీ ఉన్న వారికి బ్యాంకుల ద్వారా 120 కోట్లు గ్యారెంటీ ఎలా ఇప్పించారు అని ఏసీబీ ప్రశ్నించింది.
Read Also : అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
దానికి ఆసక్తికార సమాధానం చెప్పారట. ఈ విషయం నాకంటే మీకే బాగా తెలుసు, నాకున్న సమాచారం మొత్తం మీకు చెప్పా అని చెప్పిన ఆయన… నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఏసీబీని వేడుకున్నారట వెంకటరెడ్డి. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దలకు లబ్ది ఏ రూపంలో చేకూరింది అనే అంశాలను కూడా ఏసీబీ అడగగా తనకు ఏం తెలియదని సమాచారం ఇచ్చారట. అయితే ఇక్కడ కొందరి ఐఏఎస్ అధికారులు, రాయలసీమకు చెందిన ఒక కీలక నేత పేరు చెప్పారట వెంకటరెడ్డి. ఆయన వద్ద కీలక సమాచారం ఉండవచ్చని సమాచారం ఇచ్చారట.