తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయంలో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. రాజకీయంగా ఈ పదవి మీద ఉత్కంఠత ఎక్కువ. ఇక బోర్డ్ మెంబర్లు ఎవరు అనే దానిపై కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కేబినేట్ కూర్పు కంటే దీని మీదనే ముఖ్యమంత్రి ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అధికారంలోకి కూటమి వచ్చి వంద రోజులు అవుతున్నా కూడా దీనిపై ముందడుగు పడటం లేదు. త్వరలోనే నిర్ణయం అంటూ రోజుకో పేరు వస్తోంది. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు చెప్పేస్తున్నారు.
రాజకీయ నాయకుల నుంచి మాజీ ఐపిఎస్, ఐఏఎస్ అధికారుల వరకు పలు పేర్లు వినపడుతూనే ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో ఆసక్తిగా ఉన్నారట. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎల్వీకి మంచి పేరు ఉంది. 2019 ఎన్నికలకు ముందు ఆయన కేంద్ర పెద్దల ఆశీర్వాదంతో హడావుడి చేసినా తర్వాత సెట్ అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళ పాటు ఆయన్నే సిఎస్ గా కొనసాగించారు. కానీ సొంత రాజ్యాంగం అమలు పరచాలన్న జగన్ నిర్ణయాన్ని ఆయన అమలుచేయకపోవడంతో ఈయన్ను పక్కన పెట్టారు. ఆ తర్వాత దేవాలయాల చుట్టూ తిరిగారు ఎల్వీ.
Also read : బరితెగించిన దువ్వాడ…!
అవకాశం దొరికిన ప్రతీసారి జగన్ సర్కార్ పై అప్పట్లో ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేసారు. ఇప్పుడు కూడా ఆయన జగన్ ను విమర్శిస్తూ ఉంటారు. ఎల్వీకి సమర్ధ అధికారిగా మంచి పేరు ఉంది. ఆయనను టీటీడీ చైర్మన్ ను చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉండవచ్చు. పాలనా వ్యవహారాలపై మంచి పట్టు ఉండటం కూడా ఎల్వీకి కలిసి వచ్చే అంశం. ఇక మరో మాజీ ఐపిఎస్ అధికారి పేరు కూడా ఈ పదవి విషయంలో వినపడుతోంది. చంద్రబాబు నిర్ణయం కోసమే ఇప్పుడు చాలా మంది ఎదురు చూపులు. దసరా తర్వాత ఎంపిక పూర్తి కావొచ్చని అంచనా వేస్తున్నారు.




