రిలీజ్ రోజే మా సినిమా రికార్డ్ బ్రేక్ చేసిందంటూ పోస్టర్లు వేస్తారు. వంద కోట్లు దాటేశాం.. 200 కోట్లు కొట్టేశామంటూ ప్రమోషన్ చేస్తారు. ఇదంతా జిమ్మిక్కే అని తెలిసినా టాలీవుడ్లో ఎందుకీ బిల్డప్పులు? ఎవర్ని నమ్మించడానికి ఈ డ్రామాలు..?
ఒకప్పుడు థియేటర్లలో ఎన్ని రోజులు ఆడిందో చూసి.. సినిమా హిట్టయ్యిందో లేదో చెప్పేవారు. 50 రోజులు.. 100 రోజులు.. 175 రోజులంటూ లెక్కలతో రిలీజ్ చేసేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. రిలీజ్ రోజే వసూళ్లలో రికార్డ్ బ్రేక్ అయ్యిందంటూ గొప్పలు చెప్తున్నారు. నోటికొచ్చిన నంబర్ చెప్తూ పోస్టర్లు వేస్తున్నారు. సినిమా వందల కోట్లు కలెక్ట్ చేసిందంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. థియేటర్లో ఆడియన్స్ ఉండరు కానీ.. పోస్టర్లపై మాత్రం భారీ అంకెలుంటాయి. అది చూసి జనం నవ్వుకోవడం కామన్ అయిపోయింది. ఇలాంటి పోస్టర్లు ఎందుకూ ఉపయోగపడవు. ఈ అంకెలన్నీ జిమ్మిక్కులే అని చిత్రసీమకూ తెలుసు.. ప్రజలకూ తెలుసు. అయినా.. ఇండస్ట్రీ బిల్డప్పులు మాత్రం తగ్గట్లేదు.
Also Read :మరో రోహిత్.. సూర్యకుమార్ ను యువ ఆటగాళ్లే కాపాడారా..?
టాలీవుడ్ హీరోస్ అంటే.. వాళ్ల ఫ్యాన్స్కు బలమైన ఎమోషన్. తమ హీరోల కోసం అభిమానులు ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. అలాగే తమ అభిమానుల ఎమోషన్స్ కోసం హీరోలు కూడా చాలా జాగ్రత్తగా స్టెప్పులు తీసుకుంటారు. వాళ్లను సంతృప్తిపర్చడం కోసం భారీ వసూళ్ల పోస్టర్లు రిలీజ్ చేస్తుంటారు. కానీ.. ఇప్పుడీ ట్రెండ్ ఓవర్ డోస్ అయ్యింది. నిజంగా భారీ హైప్ ఉన్న సినిమా రికార్డు ఓపెనింగ్స్ కొడితే వాటిని ఆడియెన్స్, ఇతర హీరోల అభిమానులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ హైప్ లేని సినిమాలకు కూడా ఊహించని నంబర్స్తో వసూళ్లు ప్రకటిస్తే మాత్రం అవి చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా సంక్రాంతికి వచ్చిన సినిమాల విషయంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. చాలాచోట్ల థియేటర్లు ఖాళీగా కనిపించాయ్. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం హౌస్ఫుల్ అంటున్నారు. మా సినిమా వందల కోట్లు వసూలు చేసిందంటూ ఫేక్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా తప్పే అంటూ విమర్శలు వస్తున్నాయి. అఫిషియల్గా మేకర్స్ సినిమాలకు సంబంధించిన ఓపెనింగ్ కలెక్షన్ల పోస్టర్లను రిలీజ్ చేసినప్పటికీ.. ఇలా ఫేక్ కలెక్షన్లతో గొప్పలు పోవాల్సిన అవసరమేంటి? ఎందుకు హీరోల పరువు తీస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Also Read :నా ట్విట్టర్ నేను వాడలేదు.. షర్మిల ముందు విజయసాయి సంచలన విషయాలు…!
సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయడం అంటే ఎంత కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఒక సినిమాకు మించి మరొక సినిమా అన్నట్టుగా కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తూ వెళ్తాయి. అలా చేసుకుంటూ వెళ్లే క్రమంలోనే ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. అందులో భాగంగానే రీసెంట్గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలన్నీ ఫేక్ కలెక్షన్లు అనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతానికి ఈ ట్రెండ్ వల్ల పెద్దగా నష్టమేమీ లేకపోయినా.. రాను రానూ గట్టి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్కు విలువ లేకుండా పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా కలెక్షన్ పోస్టర్లపై టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయని ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో పదిశాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుందని.. అందులోనే డిస్ట్రిబ్యూటర్స్కు డబ్బు మిగులుతుందని చెప్పుకొచ్చారు.
Also Read :ఆరని మంచు మంటలు.. కలెక్టర్ ఆఫీస్ లో రచ్చ..!
నిర్మాతలు, డిస్టిబ్యూటర్లూ, జనాలూ.. ఈ అంకెల్ని నమ్మనప్పుడు అసలు ఇలాంటి అబద్ధపు ప్రచారాలూ, అనవసరపు ఆర్భాటాలూ ఎందుకు? ఓ సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా ఆడియన్స్కు తెలిసిపోతుంది. ఎన్ని వసూళ్లు వచ్చాయనేది అంకెల పరంగా అర్థం కాకపోయినా.. నాలుగు డబ్బులు మిగిల్చిన సినిమానా? పోగొట్టిన సినిమానా అనేది అర్థమైపోతుంది. ఇకనైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు నిర్మాతలు ఆపాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రేక్షకుల ముందు మరింత చీప్ అయిపోతారు.