పార్టీ అధినేతలకు లేని బాధ మీకెందుకు… ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ప్రశ్న తెగ వినిపిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్… రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని ప్రకటించారు. ఆనాటి నుంచి ఎన్నికల వరకు రెండు పార్టీల అధినేతలు పలుమార్లు భేటీ అయ్యారు.
ఇద్దరూ కలిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించారు. అనుకున్నట్లుగానే ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పదవుల కేటాయింపు విషయంలో కూడా రెండు పార్టీల మధ్య చక్కటి సమన్వయం కుదిరింది. అయితే తొలి నుంచి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టిడిపి, జనసేన పార్టీల నేతల మధ్య సయోధ్య కుదరటం లేదు. కొన్నిచోట్ల ఈ ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. చివరికి కూటమి నేతలు తమ పార్టీ కండువా కప్పుకోలేదని కారణంతో కూడా తగువు పెట్టుకుంటున్నారు.
Also Read : సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కైన రోజా
వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా పలు సందర్భాల్లో తమ పొత్తు చిరస్థాయిగా ఉంటుందని… తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని బహిరంగంగానే ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ఎన్నో సందర్భాల్లో అన్యోన్యంగా కనిపించారు.
అయితే అధినేతలు కలిసే ఉన్నప్పటికీ… కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు మాత్రం ఈగో పక్కన పెట్టడం లేదు. తమ వల్లే అధికారంలోకి కూటమి వచ్చిందంటూ సహచర పార్టీ నేతలపై పెత్తనం చేయాలని చూస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర మొదలు…. రాయలసీమ వరకు పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే నేతలు, కార్యకర్తలు బాహబాహికి దిగుతున్నారు. ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తోంది.