ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఐదేళ్ల పాటు నానా పాట్లు పడిన నేతలంతా పదవుల కోసం ఆశపడ్డారు. ఎన్నికల ముందు మూడు పార్టీల పొత్తు కుదిరిన తర్వాత జనసేన, బీజేపీ స్థానాల కోసం సీట్లు త్యాగం చేసిన నేతలున్నారు. ఇలాంటి వారికి తప్పకుండా న్యాయం చేస్తా అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కార్పొరేషన్ పదవుల కేటాయింపుపై ఇప్పుడు మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టుల జాబితాను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో… రెండో లిస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు.
also Read : రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు
మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకే తొలి జాబితాలో ప్రాధాన్యత ఇచ్చారని… పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన గుర్తింపు రాలేదని బహిరంగంగానే కొందరు విమర్శించారు. దీంతో సెకండ్ లిస్ట్ విషయంలో అలాంటి ఆరోపణలు రాకుండా చూసుకున్నారు చంద్రబాబు. రెండో జాబితాలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నేతలకే ఎక్కువగా ప్రాధాన్యత దక్కింది. పార్టీ అధికార ప్రతినిధులు పట్టాభి, జీవీ రెడ్డితో పాటు ఆనం వెంకటరమణా రెడ్డి వంటి నేతలకు కూడా జాబితాలో పోస్టులు దక్కాయి. అయితే అదే సమయంలో కొందరు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలకు కూడా చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు.
also Read : ఆనాడు ఈ మానవతావాదులు ఎక్కడున్నారు?
జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు సభ్యత్వం, ఉండవల్లి శ్రీదేవికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అయితే తొలి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న దేవినేని ఉమ, బ్రహ్మం చౌదరి, ఆచంట సునీత, జ్యోత్స్న తిరునగరి, సుగుణమ్మ, మజ్జి పద్మావతి, కొణతాల రత్నకుమారి, గుండ లక్ష్మీదేవి, శాసనాల వీరబ్రహ్మం వంటి నేతలకు జాబితాలో స్థానం దక్కలేదు. పార్టీ గెలిచిన వెంటనే నేతలంతా పదవులు వస్తాయని గంపెడంత ఆశ పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఆరు నెలలు గడవటంతో ఇంకెప్పుడు ఇస్తారు సార్ అనే మాట వినిపిస్తోంది. మిగిలిన పోస్టులను కూడా సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.