హైదరాబాద్ లోని హెచ్ సియూ భూముల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం అంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడిపై కాంగ్రెస్ ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. గులాబీ పార్టీ పదేళ్ళ కాలంలో జరిగిన కార్యక్రమాలపై పలు ఆధారాలను బయటకు తీస్తూ ఘాటుగా కౌంటర్లు ఇస్తోంది. 2014 నుంచి 2023 మధ్య లక్షలాది చెట్లను నరికినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నిలదీస్తోంది. హరిత హారం పేరుతో అడవులను పెంచేందుకు దాదాపు రూ. 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు.
Also Read : ట్రంప్ దెబ్బ ఇలా కూడా..!
అయితే 2015 నుండి 2022 వరకు, హరితహారం కార్యక్రమం కింద 219 కోట్ల మొక్కలు నాటగా.. వాటికి అయిన ఖర్చు 9,777 కోట్ల రూపాయలు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు, అలాగే అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించగా నాటిన మొక్కలు 85% బతికాయని కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. కాని అటవీ విస్తీర్ణం పెరగలేదు అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు నిజమైతే రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 21,591 చ.కి.మీ 2014కు నుంచి 2021 నాటికి 21,213 చ.కి.మీలకు ఎందుకు తగ్గిందో గులాబీ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
Also Read : పెద్ది పక్కా హిట్.. సెంటిమెంట్ ఏం చెప్తుంది..?
2014 నుంచి 2024 మధ్య కాలంలో.. బీఆర్ఎస్ పాలనలో 11,422.47 హెక్టార్ల అటవీ భూమి అధికారికంగా.. అటవీయేతర ప్రయోజనాల కోసం కేటాయించినప్పుడు పర్యావరణ వేత్తలు ఎందుకు మాట్లాడలేదని మండిపడుతోంది. అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి 2016 నుంచి 2019 మధ్య కాలంలోనే 12,12,753 చెట్లను నరికారని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 8 వేల ఎకరాల్లో అడవుల విధ్వంసం జరిగిందని విమర్శిస్తోంది. ఏ ఉపయోగం లేకుండా పోయిన ప్రాజెక్ట్ కోసం మూడేళ్ళ కాలంలో లక్ష కోట్లు ఖర్చు చేయగా.. 8 వేల ఎకరాల్లో అడవులు నరికారు. అప్పుడు అడవి జంతువులు, పర్యావరణం లేదా అంటూ కాంగ్రెస్ ఘాటుగా కౌంటర్లు ఇస్తోంది.