2014 నుంచి 2019 వరకు ఏపీలో బిజెపి వేసిన చిందులు అన్నీ ఇన్నీ కాదు. బిజెపి వేసింది అనడం కంటే వైసీపీ కోసం, వైసీపీ మీద విశ్వాసం చూపుతూ కొందరు బిజెపి నేతలు జగన్ బీ టీం రూపంలో డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు అనే విషయం అందరికీ తెలిసిందే. బిజెపి అగ్ర నేతలకు తెలుగు రాకపోవడం, టీడీపీ అగ్ర నాయకత్వానికి హిందీ పై పట్టు లేకపోవడం వాళ్లకు ప్లస్ అయిందో ఏమో గాని… వీళ్ళు ఏ కబుర్లు చెప్పినా అప్పట్లో బిజెపి అధిష్టానం ఆలకించేది. చివరకు వాళ్ళ అంతిమ లక్ష్యం నెరవేరి… చంద్రబాబు తన అసలు శత్రువును వదిలి, కొసరు శత్రువుపై పోరాటం చేసారు ఉత్తరప్రదేశ్ వెళ్లి.
ఇప్పుడు కాలం మారింది, రాజకీయ అవసరాలు మారాయి. రెండు పార్టీలకు పరిస్థితి నాకు నువ్వు, నీకు నేను అన్నట్టుగా పరిస్థితి మారింది. గతం మర్చిపోయారు… తాము ఎలా ఉంటే లాభమో ఆలోచించుకుని అడుగులు వేయడం మొదలుపెట్టారు. గతంలో రాష్ట్రానికి మట్టి తప్పించి ఏదీ ఇవ్వని మోడీ సర్కార్… ఏకంగా మొన్నటి బడ్జెట్ లో 15 వేల కోట్లు రాష్ట్రానికి కేటాయించింది. పోలవరం పూర్తి చేస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడం బోనస్. రెండు పారిశ్రామిక నగరాలను ఏపీకి కేటాయించడం మరో కొసమెరుపు.
Read Also : జగన్ నోటి దూల మండలిలో వైసీపీ ని ముంచేసిందా?
బిజెపిలో ఇప్పుడు జగన్ కు అనుకూలంగా వ్యవహరించే నాయకులు ఎవరూ కీలక పదవుల్లో లేరు. ఏం మాట్లాడాలన్నా సరే ఆలోచించే నాయకత్వమే ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలి నుంచి చంద్రబాబుకి పూర్తి సహకారం ఉంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత… 15 వేల కోట్లు అప్పు అని… అది రాష్ట్రమే కట్టాలని వచ్చిన విమర్శలకు వ్యూహాత్మకంగా బిజెపి సమాధానం చెప్పింది. నిర్మలా సీతారామన్ తో తెలుగులో ప్రెస్ మీట్ పెట్టించి క్లారిటీ ఇచ్చారు. పోలవరం గురించి కూడా ఆమె తెలుగులోనే క్లారిటీ ఇచ్చేసారు. ఇక బిజెపి ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాటకు విలువ ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి చాలా చక్కగా తీసుకు వెళ్తున్నారు.
బిజెపితో పొత్తు విషయంలో చంద్రబాబు చాలా సౌకర్యవంతంగా ఉన్నారనే విషయం క్లియర్ గా అర్ధమవుతోంది. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలు బయటకు రావాలనుకుని రాజీనామా చేయాలి అనుకుంటే… ఉదయం రాజీనామా చేస్తే సాయంత్రానికి ఆమోదం లభించింది. విజయవాడ వరదల విషయంలో కేంద్రం చాలా స్పీడ్ గా రియాక్ట్ అయింది. హెలికాప్టర్ లు పంపడం, బుడమేరు కోసం ఆర్మీని పంపడం, కేంద్ర మంత్రి బృందాన్ని పంపడం ఇలా అన్నీ స్పీడ్ గానే జరిగాయి. ఇలా బిజెపి నుంచి అన్ని విధాలుగా చంద్రబాబుకు సహకారం ఉంటోంది.