ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం పనులకు శ్రీకారం చుట్టింది. గతంలో ఆగిపోయిన పనులను మళ్ళీ తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టింది. రాజధానిలో నిలిచిపోయిన పనులపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సిఫార్సులు చేయనుంది ఈ కమిటీ. అమరావతి రాజధాని పరిధిలో ఉన్న అన్ని సమస్యలను వాళ్ళు పరిశీలించి నివేదిక ఇస్తారు.
పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ ఛైర్మన్ గా మొత్తం ఏడుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసారు. కమిటీలో సభ్యులుగా ఆర్ అండ్ బీ, వీఎంసీ, ఏపీసీపీడీసీఎల్, ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఒక ప్రతినిది ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. ఏపీసీఆర్డీఏలో పనులకు సీఆర్డీఏ సీఈ కన్వీనర్ గాను, ఏడీసీఎల్ పనులకు కన్వీనర్ గా ఏడీసీఎల్ సీఈ ఉంటారని తెలిపారు. మొత్తం 9 అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. నెలరోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు.
రాజధాని నిర్మాణంలో పనుల ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేయనున్న సాంకేతిక కమిటీ.. మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను అంచనా వేయనుంది. దీని కోసం గుర్తింపు పొందిన సంస్థల సలహాలు కూడా తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టం అంచనా వేయనున్నారు. రాజధాని లోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ క్వాలిటీ పరిశీలించి… పైప్ లు, ఇనుము, ఇతర మెటీరియల్ సేవా సామర్ధ్యం అంచనా వేయనున్నారు. అవసరమైన చోట తిరిగి పరికరాలు అమర్చడంపై పలు సూచనలు చేయనుంది. ఎక్కడి నుంచి పనులు మొదలుపెట్టాలనే దానిపై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది.




