ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్ లో కలెక్టర్ ల సమావేశం మొదలైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు మంత్రులు, శాఖల అధిపతులు, కలెక్టర్లు హాజరు అయ్యారు. ఈ నేపధ్యంలో సిఎం చంద్రబాబు.. ప్రారంభ ఉపన్యాసంలో ఆసక్తికర కామెంట్స్ చేసారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలి.. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని సూచించారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలి.. డేటా డ్రివెన్ గవర్నెన్సు ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read : రఘురామపై పీవీ సునీల్ సంచలన ట్వీట్..!
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రసంశలు కురిపించారు. కానిస్టేబుల్ నియామక పత్రాలు అందించిన కార్యక్రమం గురించి మాట్లాడిన సిఎం.. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారని, ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే.. తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని, డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా.. పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని కొనియాడారు సిఎం.
Also Read : కొత్త నియోజకవర్గాలపై కేంద్రం క్లారిటీ..!
ఈ సందర్భంగా పీపీపీ విధానంపై మాట్లాడారు చంద్రబాబు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని, మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది.. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరిగాయన్నారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు.. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించే వాళ్లమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది.. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని, విమర్శలు చేస్తే భయపడేది లేదు.. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలన్నారు సిఎం.

