నేడు జరగబోయే ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్ లోని కేబినెట్ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి మండలి భేటీ కానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ లో నిర్ణయించే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది.
13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : రఘురామరాజు కేసులో కీలక ట్విస్ట్..! విజయ్ పాల్ ను దాచింది ఎవరు..?
రూ.5లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాలంటీర్ల విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల విలీనం పై కూడా చర్చించనుంది కేబినేట్.