ఏపీలో మంత్రివర్గ విస్తరణ అంటూ దాదాపు మూడు నెలల నుంచి హడావుడి జరుగుతూనే ఉంది. ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది పేర్లు చర్చకు వస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట వచ్చిన ప్రతిసారి క్యాబినెట్లో ఖాళీగా ఉన్న బెర్త్ గురించి పెద్ద చర్చ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ బెర్త్ విషయంలో ప్రభుత్వ పెద్దలు సైలెంట్ గా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అనవసరంగా క్యాబినెట్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టొద్దని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
Also Read : అమరావతిలో కొత్త పోలీస్ స్టేషన్.. ఎందుకంటే..!
ముందు నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం గట్టిగా జరిగింది. ఈ విషయంలో.. కూటమిలో మూడు పార్టీలు సానుకూలంగానే ఉన్నాయి. అయితే టిడిపి కార్యకర్తల్లో వ్యతిరేకత రావటంతో కూటమి వెనక్కు తగ్గినట్లు ఈ మధ్య ప్రచారం జరిగింది. దీనితో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించాలని పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే మంత్రి పదవి విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత పట్టు పట్టలేదు అనేది రాజకీయ వర్గాల మాట.
Also Read : నారా చంద్రబాబు నాయుడు.. C/o అమరావతి
వివాదాస్పదనేతగా పేరున్న నాగబాబు విషయంలో అనవసరంగా సమస్యలు వద్దని భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక క్యాబినెట్లో కొంతమంది మంత్రి పదవులు విషయంలో పెద్ద చర్చ జరిగింది. కొంతమందిని క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కీలక సమయం కాబట్టి క్యాబినెట్లో మరో ఏడాది వరకు వేలు పెట్టొద్దని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే సమర్థవంతంగా లేని మంత్రుల విషయంలో మాత్రం కాస్త కఠినంగానే ఉండే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. సమర్దవంతంగా పనిచేయని మంత్రులను ఇప్పటికే సున్నితంగా పార్టీ అధిష్టానం హెచ్చరిస్తూ వచ్చింది. అయితే శాఖల విషయంలో మాత్రం కాస్త మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.




