ఆంధ్రప్రదేశ్ లో మహళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ పథకం అమలు చేస్తే.. రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 2 వేల బస్సులతో పాటు, 11,500 మంది సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు అధికారులు. ఎంత రాబడి తగ్గుతుంది, ఏయే బస్సులకు డిమాండ్ ఏర్పడుతుందనే వివరాలతో ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్దం చేసారు.
Also Read: తెలుగుదేశం.. పడిలేచిన కెరటం..!
ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి నేతృత్వంలో తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్ ప్రయాణం అమలు తీరును చూడటంతో పాటు, అధికారులిచ్చిన నివేదికపైనా పరిశీలన చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం సగటున 44 లక్షల మంది ప్రయాణిస్తున్నారని… ఇందులో పాస్ హోల్డర్లు కాకుండా.. రోజుకు 27 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తారని తేల్చారు. వీరిలో సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్, ఏసీ సర్వీసుల్లో ప్రయాణించేవారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారట.

మిగిలిన 24 లక్షల మంది పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసు, విజయవాడ, విశాఖపట్నంలోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసు ప్రయాణికులు ఉన్నారు. ఈ సర్వీసుల్లోనే రోజుకు ప్రయాణికుల సంఖ్య 10 లక్షల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారిలో 40% మహిళలు, 60% పురుషులు ఉన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య 60 శాతానికి చేరుతుందని తేల్చారు. ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 68-69 శాతం ఉండగా, అది 95 శాతానికి చేరుతుందని అంచనా వేసారు.
Also Read: ఏపీపై రైల్వే శాఖ వరాల జల్లు..!
తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే అక్కడి ఓఆర్ 95 శాతానికి చేరిందట. ప్రయాణికుల సంఖ్య పెరిగే సర్వీసుల్లో బస్సుల సంఖ్య పెంచాలని తేల్చారు. మొత్తం ఐదు రకాల సర్వీసులు కలిపి అదనంగా 2 వేల బస్సులు కావాలని అధికారుల నివేదిక ఇచ్చారు. ఆర్టీసీలో ఇప్పటికే డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇబ్బందులు లేకుండా కొత్త పథకం అమలు జరగాలంటే 5 వేల మంది డ్రైవర్లు, మరో 5 వేల మంది కండక్టర్లు, 1,500 మంది మెకానిక్లు ఇతర సిబ్బంది కలిపి.. మొత్తం 11,500 మంది ఉద్యోగులు అవసరమని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల ద్వారా రోజు వారీ రాబడి రూ.16-17 కోట్లు వస్తుంది. ఇందులో మహిళా ప్రయాణికుల ద్వారా రూ.6-7 కోట్ల వరకు వస్తోంది. వారికి ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఆ రాబడి వదులుకోవాల్సిందే అని తేల్చారు. అంటే నెలకు సగటున రూ.200 కోట్లు ఆర్టీసీ కోల్పోతుందని అధికారులు తమ నివేదికలో పొందు పరిచారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల వరకు జీతాలు చెల్లిస్తోంది. దీనితో ఈ పథకం అమలు ఎలా అనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.