ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులకు కేంద్రం మద్దతు లేదు అనే వాళ్లకు త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అనేక అనుమానాలు కలిగించిన పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి నాడు శంకుస్థాపన జరిగినా సరే ఇప్పటివరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం పరిగణించలేదు. రెండవసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పనులకు గ్రాండ్ గా శంకుస్థాపన చేశారు.
Also Read : దావోస్లో ‘టీమ్ ఏపీ’ దూకుడు.. రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు
అసలు ఎక్కడ రాజధాని అనేది ఉండదని.. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటూ వైసీపీ మాట్లాడుతున్నప్పటికీ.. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో మాత్రం కేంద్రం ముందుకు అడుగులు వేయడం లేదు అని విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపే దిశగా అడుగులు పడుతున్నాయి.
కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్యాబినెట్ నోటు తయారీలో కేంద్ర హోంశాఖ నిమగ్నమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పదేళ్లపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్.. 2024 జూన్ 2 నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తులు పంపిస్తూనే ఉంది. ఇక తాజాగా రాజధాని ఎంపిక ప్రక్రియ నిర్మాణాలపై కేంద్రానికి నోట్ గెజిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీనితో రాజధాని ప్రస్తావన రాష్ట్ర విభజన చట్టంలో ఉండనుంది.
Also Read : అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్.. కేసీఆర్, జగన్ కు చురకలు..!
ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ కోరగా.. 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడవు ముగుస్తున్నందున… ఆరోజు నుంచే… అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పట్టణాభివృద్ది, న్యాయ, వ్యయ శాఖల అభిప్రాయాలను త్వరగా పంపాలని హోం శాఖ కోరినట్లు తెలుస్తోంది. పలు మంత్రిత్వ శాఖలతో పాటు.. నీతి ఆయోగ్ అభిప్రాయం కూడా కోరిన కేంద్ర హోం శాఖ.. రెండు దఫాలుగా జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతి రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

