ఇప్పుడు టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హడావుడి పెద్ద ఎత్తున నడుస్తోంది. పాన్ ఇండియా సినిమాలతో నిర్మాతలకు భారీ లాభాలు రావడంతో వాళ్ళు కూడా అలాగే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా అనే మాట వస్తే సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి అనే భావనలో ఉన్నారు నిర్మాతలు. అందుకే దర్శకులను, రచయితలను కూడా పాన్ ఇండియా సినిమాకే కథలు రాయమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమా పేరుతో టాలీవుడ్ లో ఒక కొత్త సంస్కృతి మొదలయింది అనే కామెంట్స్ వినపడుతున్నాయి.
పాన్ ఇండియా సినిమా పేరుతో ఎంత సేపు బాలీవుడ్ నటులకు లేదా ఇతర భాషల నటులకు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. చిన్న చిన్న పాత్రలకు సైతం పెద్ద నటులను ఎంపిక చేసి వారికి ఖర్చు చేస్తున్నారట మన నిర్మాతలు. కొన్ని సినిమాల్లో అవసరం లేకపోయినా ఇతర భాషల నటులను తీసుకోవడం చికాకుగా మారింది. ఎప్పటి నుంచో విలన్లను దిగుమతి చేసుకునే అలవాటు ఉన్నా తక్కువకు చేసే వాళ్ళను తెచ్చే వాళ్ళు.
హీరోయిన్ల విషయంలో కూడా అదే నడుస్తుంది. ముంబై నుంచి వచ్చే హీరోయిన్లకు పెద్దగా పారితోషకం ఇచ్చేవారు కాదు మన నిర్మాతలు. వారికి పేరొచ్చినా తరువాత మాత్రమే మంచి పారితోషకం లభించేది. కాని ఇప్పుడు విలన్లకు భారీగా ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో విలన్ గా ఫేమస్ అయిన బాబి డియోల్ కు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు మన టాలీవుడ్ లో.

అలాగే అజయ్ దేవగన్, అమితాబ్, అనుపమ్ ఖేర్ సహా కొందరు స్టార్ నటులను ఇక్కడకు తీసుకొస్తున్నారు. హీరోయిన్లు శ్రద్దా కపూర్, దిశా పటాని, దీపికా పడుకొన్ వంటి వారిని పాన్ ఇండియా పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి భారీగా ఖర్చు పెడుతున్నారు. కొందరు దర్శకులు అయితే… ఇతర భాషల హీరోలతో తెలుగులో డైరెక్ట్ సినిమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంస్కృతి ఆగకపోతే తెలుగులో నటులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.