గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ముంబై సినీ నటి వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. సినీ నటి విషయంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు అలాగే కొందరు ఐపిఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెను ఒక రహస్య ప్రాంతంలో ఉంచి వేధించారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం ప్రజల్లో కూడా దీనిపై చర్చ జరిగిన నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. ఆమె కూడా పలు చానల్స్ చర్చా వేదికల్లో పాల్గొని పలు సాక్ష్యాలను చూపిస్తూ తనను వేధించారని వాపోయారు.
ఈ నేపధ్యంలో ఈ కేసుని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలని చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. ఇక పోలీసులు ఆమెతో మాట్లాడటంతో ఈ రోజు ఉదయం ఆమె విమానంలో విజయవాడ చేరుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ పోలీసు కమిషనర్ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసు వివరాలు, ఆధారాలు విజయవాడ సీపీకి ముంబయి నటి అందిస్తారని సమాచారం. కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఈ మేరకు నిన్న డీజీపీ ఉత్తర్వులు జారీ చేసారు. ముంబయి సినీనటి నుంచి విచారణాధికారి స్రవంతిరాయ్ వివరాలు తీసుకుంటారు. నటిపై నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ కూడా ఆమె పరిశీలించే అవకాశం ఉంది. రెండు,మూడు రోజుల పాటు విజయవాడ లోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆమె కుటుంబ సభ్యులను కూడా విచారణ పిలిచే అవకాశం కనపడుతోంది. ఈ ఘటనలో ఇంకెవరి పాత్ర ఉందనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం రోజుల్లో విచారణ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
బాలీవుడ్ నటి అరెస్ట్ వ్యవహారంలో పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేశారని ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం స్టేషన్లో ముంబయి నటి, ఆమె కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సీడీ ఫైళ్లను సీపీ తెప్పించి పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులున్నట్లు గుర్తించారు. వీటిపై నివేదిక రూపొందించి డీజీపీకి అందజేశారు.




