గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు… నాయకులు తమకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ రూపంలో దోచుకున్న మాట వాస్తవం. నియోజకవర్గాల్లో సహజ వనరుల దోపిడీ తీవ్ర స్థాయిలో జరిగిన మాట వాస్తవం. ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎమ్మెల్యేల విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయన సహజ వనరులను ఏ విధంగా దోపిడీ చేసారో గుర్తించారు.
Also Read: రిమాండ్ రిపోర్ట్ తో విజయ్ పాల్ కి ఉచ్చు బిగించిన పోలీసులు
గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడి అయింది. గన్నవరంలో నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. కూలీలు, తన వద్ద పనిచేసే డ్రైవర్ల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారం తవ్వకాలు జరిపారు. ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు అని గుర్తించారు. గోరంత అనుమతులు తీసుకుని కొండలన్నీ పిండి చేశారని వెల్లడించారు. ఆగిరిపల్లి, గన్నవరం రోడ్డులో కొండలను దోచేశారు.
Also Read: ఏపీ రాజ్యసభ అభ్యర్ధులు ఫైనల్ అయినట్లే…?
గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన చేసారు. రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు సమాచారం. సీనరేజి చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు రూ. 100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు నమోదు చేసింది. త్వరలో వంశీని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన అనుచరుల అక్రమాలపై నియోజకవర్గ ప్రజలు ఆందోళన చేస్తున్నారు.