ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు లేదా విస్తరణకు రంగం సిద్ధం అయిందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఓ స్థానం ఖాళీగా ఉంది. దీనికి పలువురు నేతల పేర్లు వినబడినా చివరకు జనసేన నుంచి నాగబాబు పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని టిడిపి, జనసేన రెండు అధికారికంగా ప్రకటించాయి. టిడిపి తమ అధికారిక లెటర్ హెడ్ లో నాగబాబు పేరును ప్రస్తావించగా, పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో నాగబాబు పేరును ఖరారు చేశారు. ఇటీవల 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వగా అందులో ఒక స్థానాన్ని నాగబాబుకు కేటాయించారు.
Also Read : చంద్రబాబుకు, జగన్కు అదే తేడా..!
దీనితో పవన్ కళ్యాణ్ ముందుగా చెప్పినట్లుగానే నాగబాబు మార్చి నెలలో క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. కానీ ఇది ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని కారణాలతో నాగబాబు ను క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ ఆయనకు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగానే తెలుస్తోంది. ఇక నాగబాబుని క్యాబినెట్ లోకి తీసుకోవడం మాత్రమేనా లేదంటే క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టిడిపికి సంబంధించి ఒకరిద్దరు మంత్రులపై పనితీరు విషయంలో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఒకటి, రెండు సార్లు చంద్రబాబు కొందరు మంత్రులకి హెచ్చరికలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
Also Read : ఒక్క ఫోటోతో షేక్ అవుతున్న టీడీపీ సోషల్ మీడియా
సీఎం చంద్రబాబు కూడా సదరు మంత్రుల విషయంలో అసహనంగానే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలను, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను పట్టించుకోని మంత్రుల విషయంలో సీఎం సీరియస్ గా ఉన్నారనేది ప్రభుత్వ వర్గాల మాట. దీనితో వారిని క్యాబినెట్ నుంచి పక్కకు తప్పించే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పునర్వ్యవస్థీకరణ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు మంత్రుల విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాజకీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా క్యాబినెట్లో ఎటువంటి మార్పులు చేయకుండానే కేవలం నాగబాబుని మాత్రం క్యాబినెట్లోకి తీసుకుని సదరు శాఖను కేటాయించే అవకాశాలు కూడా ఉండవచ్చు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.