ఏపీలో రాబోయే ఎన్నికల్లో గోదావరి జిల్లాల సీట్లు కీలకం కానున్నాయి. ఆ రెండు జిల్లాల్లో ఎవరైతే మెజారిటీ సీట్లు సాధిస్తారో వారే అధికారం చేప్పట్టే అవకాశం ఉందన్న సర్వ్ రిపోర్టుల ఆధారంగా అన్ని ప్రభుత్వాలు కార్యాచరణకు పూనుకున్నాయి. ఇక ఇప్పటివరకు సినిమాలతో బిజీగా గడిపిన జనసేనాని ఇప్పుడు గోదావరి జిల్లాల్లో సునామీ సృష్టిస్తున్నారు. వారాహి యాత్రలో పవన్ సభలకు జనం భారీగా తరలి వస్తున్నారు. గతంలో లేని విధంగా పవన్కు ప్రజా మద్ధతు క్రమక్రమంగా పెరుగుతుంది.
ఈ యాత్రలోనే వైసీపీ ఓటమే లక్ష్యంగా తమ పయనం ఉంటుందని పవన్ ప్రజలకి, కార్యకర్తలకి స్పష్టం చేస్తున్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ జగన్ ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనని ప్రజలకి, కార్యకర్తలకి హామీ ఇస్తున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుని వైసీపీని ఓడించే దిశగా పవన్ ఆలోచనలు ఉన్నాయని ఆయన్ను దగ్గర నుంచి గమనిస్తున్న నాయకులు పేర్కొంటున్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రం పదేళ్లు పైగానే వెనుకబడిందని, మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఏపీ నామరూపాల్లేకుండా పోతుందని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించటం గమనార్హం.
అయితే గోదావరి జిల్లాల్లో కూడా రెడ్డి సామాజికవర్గం పెత్తనం తీసుకొచ్చి..వర్గ విభేదాలు సృష్టించి గోదావరి జిల్లాల స్వచ్ఛతను నాశనం చేశారని, మొత్తం అక్రమాలే అని పవన్ ఫైర్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వనని పవన్ సవాల్ చేశారు. మరి అది సాధ్యమవుతుందా? అంటే కష్టమే అని చెప్పాలి. టిడిపితో పొత్తు ఉంటేనే పవన్ ఆలోచన కొంతమేర సాధ్యమవుతుంది. టిడిపి – జనసేన కలిస్తే గోదావరిలో ఓట్లు, సీట్ల సునామీ ఖాయం అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే రెండు ఉమ్మడి జిల్లాల్లో స్వీప్ చేస్తారా? అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వీప్ సాధ్యమే.
2014లో టిడిపి కి జనసేన మద్ధతు ఇచ్చింది. దీంతో జిల్లాలో 15కి 15 సీట్లు గెలుచుకుంది. బిజేపితో పొత్తు ఉన్న విషయం తెలిసిందే. టిడిపి 14, బిజేపి 1 సీటు గెలుచుకుంది. తూర్పులో 19 సీట్లు ఉంటే టిడిపి 13, బిజేపి1, వైసీపీ 5 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు టిడిపి – జనసేన కలిస్తే పశ్చిమలో దాదాపు స్వీప్ చేయవచ్చు. లేదంటే వైసీపీకి ఒకటి, రెండు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది.
తూర్పు గోదావరిలో స్వీప్ కష్టమే కానీ అసాధ్యం ఏమీ కాదు. టిడిపి – జనసేన కలిస్తే 15 పైగా సీట్లు ఖచ్చితంగా గెలుచుకునే ఛాన్స్ ఉంది. వైసీపీకి 3-4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి టిడిపి – జనసేన కలిస్తే గోదావరి జిల్లాల్లో చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.




