తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ప్రతిపక్ష అన్నాడిఎంకేలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సిఎం ఎడప్పాడి పళని స్వామి నాయకత్వంలో ముందుకు వెళ్తున్న అన్నాడిఎంకేలో చీలిక తెచ్చేందుకు, మాజీ సిఎం జయలలిత, నెచ్చెలి శశికళ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా అన్నాడిఎంకేలో కీలక నేతగా ఉన్న సెంగోట్టియన్.. టీవీకే దినకర్ తో భేటీ అయ్యారు.
Also Read : ఆ విషయంలో మీనమేషాలు లెక్కేస్తున్న అధినేత..!
ఆ తర్వాత ఆయనను పళని స్వామి పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన శశికళ, దినకరన్, మాజీ సిఎం పన్నీర్ సెల్వం వంటి వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని కొన్నాళ్ళుగా ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వారితో భేటీ అయినట్టు సమాచారం. అయితే.. ఇప్పుడు అన్నాడిఎంకేలో చీలిక కోసం శశికళ కష్టపడుతున్నారనే కామెంట్స్ వినపడుతున్నాయి. గతంలో తనతో సన్నిహితంగా మెలిగిన నేతలు, తాను ఎమ్మెల్యే సీట్లు ఇప్పించిన నాయకులపై ఆమె క్రమంగా ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది.
సీనియర్ నాయకులు కొందరిని ఆమె బెదిరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ముఖ్యమంత్రి కాకుండా పళని స్వామి అడ్డుకున్నారనే అభిప్రాయంలో ఉండే శశికళ.. ఇప్పుడు పళని స్వామి చేతిలో పార్టీ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలతో కూడా ఆమె చర్చలు జరిపి ఉండవచ్చనే అభిప్రాయం సైతం వినపడుతోంది. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న నాయకత్వాన్ని ఆమె టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం.
Also Read : భారతి సిమెంట్ మేనేజర్ పై కేసు..!
అలాగే వారికి సంబంధించిన సమాచారం కూడా ఇప్పటికే డిఎంకె నేతలకు శశికళ వర్గం అందించి ఉండవచ్చనే అనుమానాలు సైతం బలపడుతున్నాయి. అయితే ఆమె ప్రయత్నాలను అడ్డుకునేందుకు అన్నాడిఎంకే సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు జరిపే నాయకులతో ఇప్పటికే అన్నాడిఎంకే కీలక నేతలు మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పార్టీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందనే నాయకులపై కూడా ఓ కన్నేసి ఉంచింది అధిష్టానం. పళని స్వామికి ప్రజల్లో క్రమంగా ఆదరణ పెరుగుతోన్న నేపధ్యంలో పార్టీ అధిష్టానం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

