ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. గత విచారణలో మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏసీబీ కసరత్తు చేస్తోంది. కేసు విచారణలో భాగంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మూడోసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అరవింద్ కుమార్ ఏ2 గా ఉండగా మాజీ మంత్రి కేటీఆర్ ఏ1 గా ఉన్నారు.
Also Read : అప్పుడు వైఎస్ సునీత, ఇప్పుడు సింగయ్య భార్య.. జగన్ ఫార్ములా
మూడోసారి జరిగిన విచారణలో అరవింద్ కుమార్ నుంచి ఏసీబీ కీలక అంశాలు రాబట్టింది. అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని గత విచారణలోనే చెప్పిన అరవింద్ కుమార్ హెచ్ఎండీడబ్ల్యూ ఖాతా నుండి ఎఫ్ఈవో కంపెనీకి నిధులు మళ్లింపుపై తన ప్రమేయం ఏ మాత్రం లేదని విచారణాధికారులకు చెప్పారు. కేటీఆర్ స్వయంగా వాట్సప్ ద్వారా ఎఫ్ఈవో కు నిధులు విడుదల చేయాలని ఆదేశించారని.. ఇందులో తనకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని వివరించారు. బిజినెస్ రూల్స్ , ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని అప్పట్లో తాను మంత్రి కేటీఆర్కు చెప్పినట్లు అరవింద్ కుమార్ చెప్పారు. ఎఫ్ఈవో కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని, మిగతా వ్యవహారాలు తాను చూసుకుంటానని మంత్రి కేటీఆర్ చెప్పడంతో రూ.45.71 కోట్లు నగదును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామని అరవింద్ కుమార్ చెప్పారు. మూడో రోజు విచారణలో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డు చేసిన ఏసీబీ అధికారులు విచారణకు మరోసారి అందుబాటులో ఉండాలని సూచించారు.