ఎవరినీ అరెస్టు చేయరు… నెలలు గడుస్తున్నా కేసును పట్టించుకోరు. నిందితులందరూ కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు వెయిట్ చేస్తారు. ఇది ఏపీలో ముఖ్యమైన కేసుల విషయంలో పోలీసుల తీరుపై కూటమి కార్యకర్తల విమర్శలు. ఇప్పటికైనా పోలీసుల వైఫల్యంపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే, అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుందని పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : పెద్దన్నకు లైన్ క్లియర్ చేసుకున్న పవన్…?
ఏపీలో కేసుల విషయంలో పోలీసుల వేచిచూసే ధోరణిపై కూటమి కార్యకర్తలు మండిపడుతున్నారు. కేసుల విషయంలో నాన్చుడు ధోరణితో నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను కూడా కించపరస్తూ సోషల్ మీడియాలో కొందరు సోషల్ మీడియా సైకోలు పోస్టులు పెట్టారు. తనపై వచ్చిన పోస్టులను చూసి పవన్ కళ్యాణ్ కుమార్తె కన్నీరు పెట్టుకుంటే, దీనిపై ఆయన మండిపడ్డారు. అప్పుడు కానీ ప్రభుత్వంలో కదలిక రాలేదు.
సోషల్ మీడియా వేధింపుల కేసుల్లో వర్రా రవీంద్రరెడ్డి, మరికొంతమందిని అరెస్టు చేశారు. అయితే ఇందులో కింగ్ పిన్గా ఉన్న వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవరెడ్డిని మాత్రం పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. చివరకు సజ్జల భార్గవరెడ్డి తనపై పెట్టిన కేసులను కొట్టి వేయాలని హైకోర్టుకు వెళ్లగా, పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం, రెండు వారాల పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో పోలీసు యంత్రాంగం సజ్జల భార్గవరెడ్డిని నెల రోజుల నుంచి ఎందుకు అరెస్టు చేయలేకపోయిందని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.
Also Read : ఎవడు ఆపినా పోలవరం ఆపను… నా టార్గెట్ అదే: చంద్రబాబు
మరోవైపు కాకినాడ పోర్టును బెదిరించి కైవసం చేసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై పోర్టు యజమానిగా గతంలో ఉన్న కేవీరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రాంత్ రెడ్డితో పాటు, విజయసాయిరెడ్డిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అయితే ఇన్ని రోజులైనా విక్రాంత్ రెడ్డి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. చివరకు విజయసాయిరెడ్డి అయితే ఈ కేసులో తనను ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చని సవాల్ కూడా విసిరారు. అటు విక్రాంత్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి కేసును ఈనెల 24కు వాయిదా వేసి, అప్పటి వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు.
మొన్నటికి మొన్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కూడా కేసులు నమోదు అయినప్పటికీ, పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఇంటి వద్ద హైడ్రామా సృష్టించారు. తాను ఊళ్లోనే ఉన్నానని రాంగోపాల్ వర్మ వీడియోలు పెడుతున్నప్పటికీ పోలీసు యంత్రాంగం పట్టుకోలేక పోయింది. అంతకముందు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్పాల్ విషయంలో కూడా పోలీసు యంత్రాంగం ఇదే విధంగా వ్యవహరించింది. ఈ కేసులో విజయ్పాల్ సుప్రీంకోర్టుకు వెళ్తే ముందస్తు బెయిల్ తిరస్కరించింది. ఆ తర్వాత విజయ్పాల్కు నోటీసులు ఇచ్చి పిలిపించి, అరెస్టు చేశారు.
సినీ నటి జెత్వానీని వేధించిన కేసులో ఐపీఎస్ అధికారులను నేటి వరకు విచారించిన పాపాన పోలేదు. ఈ కేసును సీఐడీకి అప్పగించినప్పటికీ, కనీసం ఇందులో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను విచారణకు కూడా పిలిపించలేదు. ఇందులో ఒకరైన ఇంటెలిజెన్స్ మాజీ బాస్ PSR ఆంజనేయులు ముందస్తు బెయిల్ కూడా దరఖాస్తు చేయకుండా సవాల్ విసిరారు. కాంతిరాణాటాటా, విశాల్ గున్నీ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేయగా, వారికి కోర్టు నుంచి మధ్యంతర రక్షణ లభించింది.
Also Read : సోషల్ మీడియాను ఊపేస్తున్న చంద్రబాబు, పవన్
ఏపీలో మరికొన్ని కీలక విషయాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం మినహా ఆ తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిందితులను అరెస్టు చేయకుండా, పోలీసులు మీనమేషాలు లెక్కపెడుతున్నారని కూటమి పక్షాల నేతలు మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ రికార్డుల దహనం కేసు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి పరారీ కేసులో నేటి వరకు పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేక పోయారు. గత ప్రభుత్వ హయాంలో కేసు పెట్టక ముందే నిందితులను అదుపులోకి తీసుకుని, ఆతర్వాత కేసులు పెట్టిన విషయం మరచిపోవద్దని కూడా కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అదే పోలీసులు ఇప్పుడు పని చేస్తున్నారని, ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.