వైసీపి అధినేత జగన్ నిన్న పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈసారి బుడమేరు అనే పదానికి బదులు ‘ఏలేరు’ని పెట్టి సిఎం చంద్రబాబు నాయుడుపై జగన్ మళ్ళీ అవే విమర్శలు చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు, జగన్ ఎప్పటిలాగే ఆయనపై విమర్శలు గుప్పిస్తారనుకుంటే ఎక్కడా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. అసలు పవన్ ప్రస్తావనే రాకుండా జాగ్రత్త పడ్డారు.
Read Also : చంద్రబాబుతో జూనియర్ భేటీ.. కారణాలు వేరేనా?
కేవలం సిఎం చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేసుకొని విమర్శలు, ఆరోపణలు చేశారు. అంటే ఇదివరకు ‘ముగ్గురు పెళ్ళాలు, కార్లు మార్చిన్నట్లు పెళ్ళాలని మారుస్తారు’ అంటూ తాను పవన్ కళ్యాణ్ గురించి చులకనగా మాట్లాడటం వలన ఎన్నికలలో పార్టీకి చాలా నష్టం జరిగిందని గ్రహించారా? లేక పిఠాపురంలో ఎదురుదెబ్బ తిన్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి చెడుగా మాట్లాడితే ఇబ్బంది పడాల్సి వస్తుందనుకున్నారా? లేక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా ఇక ఎటువంటి రాజకీయ మైలేజీ రాదని భావించారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
అంటే పవన్ కళ్యాణ్ని జగన్ విమర్శించలేదని కాదు… కానీ ఇది వరకు ప్రతీ సభలో పవన్ కళ్యాణ్ గురించి చులకనగా మాట్లాడిన జగన్ ఇప్పుడు ఆయన ఊసే ఎత్తకపోవడం, అదీ… నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ని నిలదీయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్క జగన్ మాత్రమే కాదు.. వైసీపి నేతలు ఎవరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఊసే ఎత్తడం లేదు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ ధోరణిలో ఏదో మార్పు వచ్చిందని స్పష్టం అవుతోంది. ఈ మార్పు ఎందుకో భవిష్యత్లో తెలియవచ్చు.