దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మార్చి 13న షెడ్యూల్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించి మే నెల చివరి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. పది రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటన షెడ్యూల్ ఖారారైంది. 29కిపైగా సభల్లో ప్రసంగించనున్నారు. ఈనెల 13న పర్యటన ముగుస్తుంది. అదే రోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశ ఉంది.
పార్లమెంటు ఎన్నికలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిలకకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి. మోదీ రాష్ట్రాల పర్యటన కోసమే ఈసీ షెడ్యూల్ ప్రకటించడం లేదని తెలుస్తోంది. 2019లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ ఏప్రిల్ 11 నుంచి 19 మధ్య ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించింది. మే 23న ఫలితాలు ప్రకటించింది. ఈసారి కూడా దాదాపుగా అదే షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చి మే చివరి వారంలో ఫలితాలు ప్రకటిస్తుందని తెలుస్తోంది 6 నుంచి 8 దశల్లో ఎన్నికలు జరుగుతాయని సమాచారం.
ఇక తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముగ్గురు సిట్టింగులకు టికెట్ ఇచ్చింది. ఆరుగురు వలస నేతలకు టికెట్లు దక్కాయి. తాజాగా బీఆర్ఎస్ కూడా నలుగురికి టికెట్ ఇచ్చింది. ఇందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాగా, మరో ఇద్దరు మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు. పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను బరిలో దించగా, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్కుమార్ను ఎంపిక చేసింది. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్రావుకు టికెట్ ఇచ్చారు. బీజేపీ రెండో జాబితా నేడో రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో మిగతా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.