జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. దాదాపు నెల రోజుల నుంచి రాజకీయంగా అత్యంత సంచలనంగా మారిన ఎన్నిక. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి, మరో ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికపై ఎంతో ఫోకస్ పెట్టాయి. ఎవరి రాజకీయం వాళ్లు చేశారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ప్రతిపక్షాలు తక్కువ అంచనా వేశాయి అనేది స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన దగ్గరనుంచి.. రేవంత్ రెడ్డి చేసిన రాజకీయం చాలామంది తక్కువ అంచనా వేస్తూ వచ్చారు.
Also Read : కొండా – అక్కినేని మధ్య రాజీ చేసింది ఎవరు..?
కాంగ్రెస్ లో ఉన్న మంత్రుల దగ్గర నుంచి.. ప్రతిపక్షాల వరకు రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలను.. కాస్త కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. తాను ఏం చేయాలనుకున్నానో.. రేవంత్ అదే చేసి చూపించారు. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి.. అజారుద్దీన్ కు మంత్రి పదవి వరకు రేవంత్ పక్కాగా రాజకీయం చేశారు. నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేసే అంశానికి సంబంధించి చాలా మందిలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. కానీ రేవంత్ తన నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గలేదు. వరుసగా మూడుసార్లు పోటీ చేసి ఓటమిపాలైన నవీన్ యాదవ్.. ముస్లిం సామాజిక వర్గాల్లో మంచి గుర్తింపు సాధించారనే నమ్మకం రేవంత్ లో బలంగా ఉంది.
దీనితో మజిలీస్ పార్టీ విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్లారు. ఆ పార్టీ పోటీలో లేకుండా చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఇక ఆ తర్వాత 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అలాగే మైనారిటీ ఓట్లపై దృష్టి పెట్టి.. భారత రాష్ట్ర సమితి హిందూ ఓటు బ్యాంకును దూరం చేసుకుందనే విషయాన్ని రేవంత్ పక్కాగా గుర్తించారు. దీనితో ముస్లిం సామాజిక వర్గాలపై ఒకవైపు దృష్టి పెడుతూనే.. హిందూ ఓటు బ్యాంకు దూరం కాకుండా జాగ్రత్త పడ్డారు.
Also Read : మాగంటి కోట కూలింది.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ భారీ ఆధిక్యం..!
కాంగ్రెస్ అగ్ర నేతలను ప్రచారంలోకి పిలవకుండా.. ప్రచారం మొత్తాన్ని తానే ముందుండి నడిపించారు రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఉండే పరిణామాలను కూడా స్థానిక కాంగ్రెస్ నాయకత్వానికి వివరించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. దీనితో రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నాయకత్వం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కష్టపడింది. భారత రాష్ట్ర సమితి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే.. రేవంత్ మాత్రం ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఓటర్లను తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు విజయం సాధించడం సహజమే. కానీ ఈ ఎన్నికలు మాత్రం రేవంత్ రెడ్డి ఇమేజ్ తోనే గెలిచాయి అనే విషయం స్పష్టంగా అర్థమైంది అంటున్నారు పరిశీలకులు. కంటోన్మెంట్ ఉపఎన్నిక విషయంలో కూడా రేవంత్ ఇదే తరహాలో రాజకీయం చేసి విజయం సాధించడంతో ఆయన ఇమేజ్ పెరిగిందనే మాట బలంగా వినపడుతోంది.

