తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఓ పొలిటికల్ కాలేజీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం. మాజీలు, తాజాలు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఓనమాలు దిద్దిన వారే. ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రులు యనమల, కళా వెంకట్రావ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుత శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా ఎంతో మంది తెలుగుదేశం పార్టీతోనే తమ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. సుశిక్షితులైన నేతలు, కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ స్థాపించినప్పుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మీద అభిమానంతో పార్టీలో చేరిన ఎంతో మంది ఇప్పటికీ పదవి లేకుండా అలాగే కార్యకర్తలుగా, ద్వితీయ శ్రేణి నేతలుగా కొనసాగుతూనే ఉన్నారు.
Also Read : సస్పెండ్ చేస్తే తిరువూరు వచ్చే దమ్ముందా..?
1982లో హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు ప్రారంభించారు. ఆ రోజు ఆయన వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ ఆ తర్వాత 1983లో ఎన్నికల నాటికి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో 60 శాతం యువతకే ఎన్టీఆర్ టికెట్లు ఇచ్చారు. కోడెల, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల వంటి యువకులకు వెన్నంటి రాజకీయాల్లో ప్రొత్సహించారు. కాకలు తీరిన రాజకీయ యోధులతో తలపడిన యువకులు.. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అటు తెలంగాణలో కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలే అన్ని పార్టీల్లో చక్రం తిప్పుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గంలో ఉన్న సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర మంత్రులుగా పని చేసిన రేణుకా చౌదరి వంటి ఫైర్ బ్రాండ్లు కూడా టీడీపీ చెట్టు నీడన ఎదిగిన వారే. ఎంతో మంది రాజకీయ దురందరులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన వారే.
Also Read : ఎంపీలు, ఎమ్మెల్యేలకు చుక్కలే.. చంద్రబాబు కీలక నిర్ణయం..!
అయితే ప్రస్తుతం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరో విషయం ఏమిటంటే.. చంద్రబాబు తీరు వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని కూడా ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలున్నారు. కొన్ని చోట్ల అయితే ఒకరి ఇద్దరు నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా. ఆర్థికంగా, సామాజిక పరంగా కూడా పార్టీలో ఉన్న నేతలున్నారు. అయితే ఇలాంటి వారి పైన చంద్రబాబుకు నమ్మకం ఉన్నట్లు కనిపించటం లేదు. అందుకే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికే కీలక పదవులిస్తున్నారు. ఇలాంటి వారు పార్టీకి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారా అంటే.. లేదనే చెప్పాలి. ఇలా పార్టీలోకి వచ్చిన వారు కీలక పదవులు అనుభవించిన తర్వాత సైలెంట్గా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇలా గతంలో చాలాసార్లు జరిగినా సరే.. చంద్రబాబు మాత్రం మళ్లీ మళ్లీ అలాగే వ్యవహరిస్తున్నారు.
Also Read : ఒక్కొక్కరికి కోటి ఇచ్చే వరకూ రేవంత్ ను వదలను.. కవిత హాట్ కామెంట్స్..!
2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత అప్పటి వరకు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన జూపూడి ప్రభాకర్ను టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. చంద్రబాబుపైన ఎన్నో ఆరోపణలు చేసిన జూపూడికి కీలకమైన ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చారు. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగిన జూపూడి సైలెంట్గా మళ్లీ వైసీపీలో చేరిపోయారు. మళ్లీ చంద్రబాబును తిట్టడం మొదలుపెట్టారు. మరోసారి కూడా అలాంటి తప్పే చేశారని ఇప్పుడు పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీపైనే విమర్శలు చేశారు ప్రస్తుత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. చంద్రబాబు ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ఆయన 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ జగన్ మాత్రం కొలికపూడికి టికెట్ ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన కొలికపూడి అమరావతి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని సైలెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరారు. చివరికి తిరువూరు ఎమ్మెల్యే టికెట్ సాధించారు. గెలిచిన తర్వాత కొలికపూడి అసలు స్వరూపం బయటపడింది. మళ్లీ వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. చివరికి జగన్కు అత్యంత సన్నిహితుడుగా ముద్ర పడిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తిరువూరు నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ పైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇలా జూపూడి, కొలికపూడి విషయంలోనే కాదు.. ఎంతో మంది విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తప్పు అని తేలిపోయింది. ఇప్పటికైనా ఇలాంటి వారి పట్ల చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.




