తెలంగాణ రాష్ట్ర సమతిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జాతకం పూర్తిగా మారిపోయింది. జాతకాలు, ముహుర్తాలను బాగా నమ్మే కేసీఆర్.. రాజ్య శ్యామల యాగం చేసిన తర్వాతే తెలంగాణ సీఎం కుర్చీ ఎక్కారనేది అందరికీ తెలిసిన విషయమే. వరుసగా రెండు సార్లు సీఎం కుర్చీలో కుర్చున్న కేసీఆర్.. మూడోసారి ఏకంగా ఢిల్లీ పీఠం ఎక్కాలని భావించారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చారు. బీఆర్ఎస్ కోసం ఢిల్లీలో ఆఫీసు నిర్మాణం చేపట్టారు. 600 వాహనాలతో బడా కాన్వాయ్లో మహారాష్ట్రలో పర్యటించారు. దేశ రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తానంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు కేసీఆర్. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
Also Read : కొత్త రూల్.. అమెరికా వీసా కావాలా..? 15 వేల డాలర్లు కట్టు..!
ఇంత హడావుడి చేసిన కేసీఆర్.. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఇదేమంటే.. దానికి ఇంకా టైమ్ ఉందన్నారు. దీంతో అంతా పార్లెమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారేమో అనుకున్నారు. కానీ మూడోసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు టైరు పంచర్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే.. పార్టీ పేరు మార్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. పేరులో ఉన్న తెలంగాణను తీసేసి.. తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తామని… ఆంధ్ర పాలకుల పెత్తనం ఏమిటంటూ కబుర్లు చెబితే ప్రజలు నమ్మలేదు. ఇక ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అయితే డిపాజిట్లు కూడా రాలేదు.
Also Read : రేషన్ అక్రమాలతో తలనొప్పి.. రెచ్చిపోతున్న మాఫియా..!
పార్టీ ఓడిన తర్వాత కేసీఆర్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారనేది వాస్తవం. కూతురు కవిత జైలుకు వెళ్లారు. కొడుకు కేటీఆర్పై ఈ ఫార్ములా కార్ రేసు కేసులో ముడి బిగుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, గొర్రెల స్కామ్ ఓ వైపు.. వీటన్నిటికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ క్షణమైనా కేసీఆర్ అరెస్టు తప్పదనే ప్రచారం.. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని అంతా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేసీఆర్ కుమార్తె కవిత వరుస బాంబులు పేల్చారు. సొంత అన్న కేటీఆర్పైనే పరోక్షంగా ఆరోపణలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు ప్లాన్ చేశారన్నారు కవిత. అలాగే పార్టీలోని కొందరు సీనియర్లపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్లో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇదే మంచి సమయం అని భావించిన గువ్వల బాలరాజు, అబ్రహం పార్టీకి రాజీనామా చేశారు. సైలెంట్గా జంప్ అయిపోయారు. వీరి రాజీనామా తర్వాత మరో ముగ్గురు కీలక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఆ ముగ్గురు ఎవరూ అనే విషయం మాత్రం తెలియటం లేదు. ఏది ఏమైనా.. మరో వారంలోనే బీఆర్ఎస్కు షాక్ తప్పదనే ప్రచారం జోరుగా నడుస్తోంది.