తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు టిటిడి బోర్డు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. దీని కోసం భక్తుల అభిప్రాయం తెసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భారీ విరాళాలు ఇచ్చే భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు సిద్దమైంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చని ప్రకటించింది. రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది సౌకర్యాలను కల్పించేందుకు సిద్దమైంది.
Also Read : మలేషియాలో క్యాంప్.. వైసీపీ బిగ్ ఆఫర్..!
సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట – 1, రవికే – 1, మహా ప్రసాదం ప్యాకెట్లు – 10, ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు అని ప్రకటించింది. అలాగే రూ. 3 వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాక జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చని ప్రకటించింది.
Also Read : ఎస్ రెడ్ బుక్ కోసమే పోలీసులు పని చేస్తారు
కాటేజ్ డొనేషన్ స్కీం, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్టు, శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్) లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధింత సౌకర్యాలను పొందవచ్చని తెలిపింది. అలాగే www.ttddevasthanams.ap.gov.in లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చని ప్రకటించింది. . ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టిటిడి పేరిట డి.డి/ చెక్ లను తీసుకుని తిరుమలలోని దాతల విభాగంలో ( డోనార్ సెల్) అందించాల్సి ఉంటుంది.