ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. పలు కీలక ప్రాజెక్ట్ లకు సంబంధించి ఆలస్యం కాకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక తాజాగా అమరావతి పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి- జీఓఎం సిఫార్సుల మేరకు రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. రాజధాని అమరావతిలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ కు 70 ఎకరాలు కేటాయించింది ఏపీ ప్రభుత్వం.
Also Read : టార్గెట్ జగన్.. వైసీపీ నేతల తీరు..!
అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థకు 10 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో బడ్జెట్ హోటల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఐఆర్ సీటీసీ సంస్థ ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వం కేటాయింపులు చేసింది. అమరావతిలో ఆస్పత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్సు కార్పోరేషన్ కోసం 25 ఎకరాల భూమి కేటాయించారు. హడ్కో హ్యాబిటాట్ సెంటర్ ఏర్పాటు కోసం 8 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : రాజకీయ అనాధలకు బిజెపి ఆశ్రయం
గతంలో భూముల కోసం దరఖాస్తు చేసిన 13 సంస్థలకు కేటాయింపులు రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం… అమరావతిలో భవనాల నిర్మాణం కోసం భూములు అడిగిన 16 సంస్థలకు చోటు మార్పు చేస్తూ భూమి కేటాయించింది. మైస్ హబ్ కోసం ఇచ్చిన 42 ఎకరాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. భూములు కేటాయించిన సంస్థలకు భవన నిర్మాణాలు, కార్యకలాపాల కోసం నిర్దేశిత గడువు విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. భవన అనుమతులు, డీపీఆర్ లు సమర్పించాలని సూచించింది. అమరావతి భూ కేటాయింపుల నిబంధనలు 2017 ప్రకారమే షరతులు విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్.