ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిందంటే ఢిల్లీలో సాధించిన పట్టు కారణం. అప్పట్లో విజయసాయిరెడ్డి జగన్ కు ఢిల్లీలో ప్రాధాన్యత పెరిగే విధంగా ప్రయత్నాలు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా జగన్ ను దగ్గర చేయడంలో విజయసాయిరెడ్డి విజయవంతమయ్యారు. ఇక జగన్ కేసుల విషయంలో ముందడుగు పడకపోవడానికి కూడా విజయసాయిరెడ్డి తన వంతు సహాయ సహకారాలు అందించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో జగన్ అలాగే అవినాష్ రెడ్డి సేఫ్ జోన్ లో ఉన్నారంటే విజయసాయిరెడ్డి కారణమనే అభిప్రాయాలు కూడా చాలా మందిలో ఉన్నాయి.
Also Read: ఎమ్మెల్యే గారి వైసీపీ ప్రేమ.. కృష్ణా జిల్లాలో అలజడి..!
అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత, లేదంటే గత కొన్నాళ్లుగా ఢిల్లీలో వైసీపీ తరఫున ఎంపీలు ఎవరు పెద్దగా కనపడటం లేదు. విజయసాయిరెడ్డి వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడప్పుడు మాత్రమే ఢిల్లీ వెళ్లారు. ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో ఢిల్లీలో వైయస్ జగన్ కు అండగా నిలబడే నాయకులు కరువయ్యారు అనే అభిప్రాయం వినపడుతోంది. ఆ పార్టీలో కొంతమంది ఎంపీలు ఉన్నా సరే వాళ్ల వల్ల పెద్దగా జగన్ కు ఒరిగిందేమీ లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో గాని లేదంటే ఇతర పార్టీల అగ్ర నేతలతో గాని వారికి ఎటువంటి సంబంధాలు ఉండవు.
Also Read: వివేకా కేసులో కీలక అడుగు.. ఇప్పుడైనా అరెస్ట్ అవుతారా…?
ఇప్పటివరకు విజయ సాయి రెడ్డి మాత్రమే అక్కడ ప్రభావం చూపిస్తూ వచ్చారు. ఇక ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడంతో జగన్ కు ఢిల్లీలో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ కు జగన్ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించినా ఆయన కూడా… పెద్దగా ఢిల్లీలో ప్రభావం చూపించే నాయకుడు కాదు. ఇక ఎంపీ మిధున్ రెడ్డి పై జగన్ ఆశలు పెట్టుకున్నా ఆయన కూడా వ్యక్తిగత అంశాలపైనే ఫోకస్ పెడుతున్నారు. బిజెపికి దగ్గర కావడానికి మిథున్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.. తప్ప జగన్ ను కాపాడేందుకు ప్రయత్నం చేయడం లేదనే అభిప్రాయం కూడా సొంత పార్టీ నేతల్లో ఉంది. తనపై, తన తండ్రిపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు మిథున్ రెడ్డి. ఇక ఇతర ఎంపీలు కూడా పెద్దగా ఢిల్లీ వైపు చూడటం లేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా ఢిల్లీ వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు ఎంపీలు.