తన మాట నెగ్గించుకునే విషయంలో ఎక్కడికైనా వెళ్లే స్వభావం ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ప్రపంచ దేశాల విషయంలో కక్ష సాధింపు దిశగా అడుగులు వేస్తున్నారు. 2025 లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను పదే పదే బెదిరిస్తూ వస్తున్న ట్రంప్ కొన్ని దేశాలపై భారీగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలను.. రద్దు చేస్తూ, ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తం తిరిగి చెల్లించాలని.. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 6/3 మెజారిటీతో ఈ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు వెల్లడించింది.
Also Read : భారత్ పై ట్రంప్ మరోసారి సంచలన కామెంట్..!
తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలను న్యాయమూర్తులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇక ఆ తర్వాత ఓవల్ ఆఫీసులో సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెట్టి.. తనకున్న అధికారాలతో మరో 10 శాతం సుంకాలు విధించారు ట్రంప్. భారత సహా ఎన్నో దేశాలను టారిఫ్ ల పేరుతో ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే. ఇక 1977 అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ప్రకారం అన్ని దేశాలపై విధించిన సుంకాలకు అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇటువంటి చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించింది అత్యున్నత న్యాయస్థానం.
Also Read : అనంతబాబును కాపాడుతున్నది ఎవరూ..?
ఆ తర్వాత సెక్షన్ 122 ప్రకారం అన్ని దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు. ఇప్పటికే ఉన్న సుంకాలకు అదనంగా ఈ నిర్ణయం వర్తిస్తుందని.. దీనికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. కొత్త 10% సుంకాలు ఈనెల 24 నుంచి అమలులోకి వస్తాయని.. దీని ద్వారా బిలియన్ డాలర్ల ఆదాయం అమెరికా ప్రభుత్వానికి చేకూరుతుంది అని.. ట్రంప్ సర్కార్ పేర్కొంది. 150 రోజులు పాటు ఈ సుంకాలు అమలులో ఉంటాయని తెలిపింది ప్రభుత్వం. కాగా భారత్ కు అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపశమనం కలిగించేదే. రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ ను ట్రంప్ టారిఫ్ ల పేరుతో బెదిరించారు.

