తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Also Read : బ్రేకింగ్: రాజధానిలో ఏం జరుగుతోంది..? అమరావతిలో హైఅలెర్ట్..!
కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు పవిత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

హరిద్ర ఘటనంలో సిద్ధం చేసిన తాజా పసుపును స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనం కార్యక్రమంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని వినియోగిస్తారు. ముందుగా పసుపు కొమ్ములు ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి ఆరాధన చేశారు. శ్రీ సూక్తం పఠనానంతరం హరిద్ర ఘటనం నిర్వహించారు. పసుపు నూరిన తరువాత సమర్పణ చేసి తాంబూలం అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత.. నిజమేనా..?
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. మార్చి 26వ తేదీన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామి వారికి వాహన సేవలు నిర్వహిస్తారు. మార్చి 31వ తేదీ రాత్రి స్వామివారికి గరుడ వాహన సేన నిర్వహించారు. ఏప్రిల్ ఒకటవ తేదీన సాయంత్రం ఎదుర్కోలు, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి వారు గజ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రికి ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఐదవ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆలయంలో శ్రీ సీతారాముల స్వామి వార్లకు పుష్పయాగం నిర్వహిస్తారు.
ఒంటిమిట్ల కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఏప్రిల్ ఒకటవ తేదీన స్వామి వారి కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం సమీపంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా డైవర్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కడప – రేణిగుంట మార్గంలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.

