ఈ రోజుల్లో ఆహారం నాణ్యత అనేది పాపంతో సమానం. నాణ్యంగా ఆహారం తినడం అనేది కలగా మారిపోయింది. చికెన్, మటన్, ఫిష్ వంటివి బయట తినాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా హైదరాబాద్ నగరంలోని పార్శీగుట్ట ప్రాంతంలో ఉన్న ‘ఏ వన్ ఫ్రెష్ చికెన్ షాప్’ పై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు చేయగా.. ఈ సోదాల్లో బయటపడ్డ దృశ్యాలు చూసి అధికారులే విస్తుపోయారు. చాలా రోజుల నుంచి నిల్వ ఉంచిన, దుర్వాసన వస్తున్న సుమారు 800 కిలోల చికెన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కేవలం ఇళ్ళకే కాకుండా, నగరంలోని ప్రముఖ వైన్ షాపులు, బార్ లు మరియు రెస్టారెంట్లకు ఈ నిల్వ ఉంచిన చికెన్ ను నిందితులు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. సదరు షాపుకు ఉండాల్సిన వ్యాపార లైసెన్స్ గత జనవరి నెలలోనే ముగిసిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారని తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, షాపు నిర్వాహకుడు షకిల్ తో పాటు మరో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మాంసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ధ్వంసం చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేసారు. చికెన్ కొనేటప్పుడు అది లేత పింక్ రంగులో ఉందో లేదో చూడాలని, ముదురు రంగులో ఉన్నా లేదా జిగటగా అనిపించినా అది పాతదని గుర్తించాలని సూచించారు. మాంసం నుంచి కొంచెం వింత వాసన వచ్చినా సరే, తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనుగోలు చేయవద్దని, రెగ్యులర్గా కొనే షాపుల్లో జీహెచ్ఎంసీ సర్టిఫికేట్ లేదా లైసెన్స్ బోర్డు ఉందో లేదో ఒక్కసారి గమనించాలని హెచ్చరించారు.

