గతంలో వరదలు, కాలవలు పొంగడం వంటి మాటలు పెద్దగా బెజవాడలో వినపడేవి కాదు. కానీ గత మూడేళ్ళ నుంచి ఈ మాట బాగా వినపడుతోంది. బందరు రోడ్డుతో పాటుగా, పటమట, ఆటోనగర్, కానూరు వంటి ప్రాంతాలు, గాంధీ నగర్, గుణదల, మాచవరం, సత్యనారాయణపురం ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి నీరు రోడ్ల మీదకు రావడంతో బెజవాడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. డ్రైన్ లలో పూడిక తీయకపోవడమే. విజయవాడ నగరం మొత్తం కూడా గత ఆరేళ్లలో పూడిక తీసిన పరిస్థితి పెద్దగా కనపడలేదు.
Also Read : విభేదాల్లో కూడా సంస్కారమే.. ఓ మెట్టు ఎక్కిన లోకేష్..!
మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకుల భజన బృందాలుగా మారిపోయారనే విమర్శలు వచ్చేవి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. గత ఏడాది ప్రభుత్వం మారిన కొన్నాళ్ళకే విజయవాడలో వరదలు ముంచెత్తాయి. ఈ ఏడాది కూడా చాలా ప్రాంతాల్లో వరద సమస్యను స్థానిక ప్రజలు ఎదుర్కొన్నారు. దీనితో మున్సిపల్ శాఖ ఫోకస్ చేసింది. సిఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. డ్రైనేజీల్లో ఆరేళ్లుగా పూడుకుపోయిన పూడికను తోడుతున్నారు.
Also Read : ఆ కేసు బోగస్.. చంద్రబాబుకు గుడ్ న్యూస్..!
ఉదాహరణకు విజయవాడ పంట కాలువ రోడ్ లో ప్రయాణించే వారికి ఈ దృశ్యాలు స్పష్టంగా కనపడతాయి. కానూరు ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు బకెట్ లు, ఇతర పరికరాలతో పెద్ద ఎత్తున మురికిని బయటకు లాగుతున్నారు. ఈ పూడిక చూసిన ప్రజలు కంగుతింటున్నారు. ప్రత్యేకంగా ట్రాక్టర్ లను కేటాయించి ఆ బురద మొత్తాన్ని వెంటనే తరలిస్తున్నారు. సనత్ నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పూడిక తీసిన దృశ్యాలు కనపడతాయి. ఇలా ప్రతీ ప్రాంతంలో కూడా డ్రైనేజీలలో వరద నీరు పోయే విధంగా చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజల సహకారం కూడా ఉండటం, వర్షాలు కూడా లేకపోవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. కార్మికుల కొరత లేకుండా పెద్ద ఎత్తున రంగంలోకి దించి శుద్ధి చేస్తున్నారు అధికారులు.

