ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి అయ్యింది. పరిపాలన ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఏపీ ఆర్థిక స్థితి కూడా నెమ్మదిగా పరుగులు పెడుతోంది. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం సైతం తన వంతు సాయం అందిస్తోంది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అడిగినన్ని నిధులు కేంద్రం విడుదల చేస్తోంది. దీంతో చంద్రబాబు చేతుల్లో కేంద్రం కీలుబొమ్మ అనే మాటను వైసీపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా పైకి వినిపిస్తున్న మాట మాత్రమే.. కానీ నిజానికి వెనుక జరుగుతున్న చర్చ మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు కేంద్రాన్ని ఆడిస్తున్నారా.. లేక చంద్రబాబును కేంద్రం ఆడిస్తుందా అనే చర్చ జోరుగా జరుగుతోంది.
Also Read : పవన్ ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉందా..?
రాజ్యసభలో ఈ ఏడాది సుమారు 50 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది. అందులో నాలుగు స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కనున్నాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు వైసీపీకి చెందిన పరిమళ్ నత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్.. మరొకరు టీడీపీకి చెందిన సానా సతీష్. నిజానికి సతీష్కు పదవీ యోగం దక్కింది గతేడాదిలోనే. కానీ అంతలోనే ఆయన గడువు ఈ జూన్ నెలతో ముగియనుంది. దీంతో మరోసారి సతీష్ను రాజ్యసభకు ఎంపిక చేస్తారనే మాట బాగా వినిపిస్తోంది. ఇందుకు మరో కారణం కూడా చెబుతున్నారు టీడీపీ నేతలు. సతీష్ను పొలిటికల్ లాబీయిస్ట్ అని ముద్దుగా పిలుస్తారు కూడా. కాబట్టి కేంద్రంలో పనులు జరగాలంటే సతీష్ ఢిల్లీలో ఉండాలనేది టీడీపీ నేతల మాట. అన్ని పార్టీల ముఖ్య నేతలతో సతీష్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి సతీష్కు మరోసారి అవకాశం తప్పదనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : జలరగడపై జగన్ గ్యాంగ్ మౌనం ఎందుకు..?
ఇక టీడీపీ తరఫున మరో అభ్యర్థిగా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు, లింగమనేనికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. దాదాపు 12 ఏళ్లుగా ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్లోనే చంద్రబాబు నివసిస్తున్నారు. అలాగే లింగమనేని ఆధ్వర్యంలోని దశావతార శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఇక గతంలో లింగమనేనికి చెందిన ఎయిర్ కోస్తా విమానయాన సంస్థలో రామ్ చరణ్ తేజ్ పెట్టుబడులు కూడా పెట్టారు. ఎన్నికల సమయంలో లింగమనేని రమేష్ ఆర్థికంగా కూడా చంద్రబాబుకు అండగా ఉన్నారనేది బహిరంగ రహస్యం. అందుకే చంద్రబాబు కూడా రమేష్ను పెద్దల సభకు పంపిస్తా అనే హామీ ఇచ్చారనేది పార్టీలో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో లింగమనేనికి దాదాపు రాజ్యసభ సభ్యత్వం ఖాయమనే మాట వినిపిస్తోంది.
Also Read : ప్రముఖ ఛానల్ చైర్మన్ తాట తీస్తున్న రేవంత్ సర్కార్..?
అయితే ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో రెండు బీజేపీ అడుగుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నిజానికి వైసీపీ తరఫున ఎంపీగా పదవీ విరమణ చేయనున్న పరిమళ్ నత్వానీకి బీజేపీ పెద్దలకు మంచి సంబంధాలున్నాయి. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీకి నత్వానీ అత్యంత సన్నిహితులు. అందుకే నత్వానీ కోసం ముఖేష్ స్వయంగా తాడేపల్లి వచ్చి జగన్తో భేటీ అయ్యారు. నత్వానీని వైసీపీ తరఫున పెద్దల సభకు పంపటం వెనుక బీజేపీ అగ్రనేతల వ్యూహం కూడా ఉందనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఈ సారి కూడా నత్వానీని పెద్దల సభలో కొనసాగించేందుకు టీడీపీ మద్దతు అడిగే అవకాశం లేకపోలేదు. అయితే నత్వానీ టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేస్తారా.. లేక బీజేపీ తరఫునా.. అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక మిగిలిన ఒక్క స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. మరి రాజ్యసభ సీట్ల పంపకం, అభ్యర్థులు ఎవరో తెలియాలంటే.. మరికొంత కాలం ఆగాల్సిందే.

