మంత్రి నారా లోకేష్ శ్రీలంక పర్యటనపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రత్యక్షంగా చూడటం కోసం మంత్రి నారా లోకేష్ శ్రీలంక వెళ్లారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే.. తిరిగి విజయవాడ చేరుకున్నారు. ఉదయమే విజయవాడ వచ్చిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ను రిసీవ్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. లోకేష్ వరుస పర్యటనలపై సోషల్ మీడియాలో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాత్రి కొలంబో, ఉదయం విజయవాడ, రాత్రికి ఢిల్లీ.. ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. దీనికి లోకేష్ కూడా ఫన్నీ గానే జవాబిచ్చారు.
అయితే లోకేష్ పర్యటనపై వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో కొలంబో వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూశారంటూ ఆరోపణలు చేశారు. చివరికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా లోకేష్ పర్యటనపై విమర్శలు చేశారు. ఇంట్లో మ్యాచ్ చూడొచ్చు కదా.. అని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు జగన్. అయితే ఈ వ్యాఖ్యలకు లోకేష్ తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. “ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా” అని వ్యంగ్యంగా జవాబు చెప్పారు. దీంతో రెండు రోజుల పాటు వైసీపీ నేతల నోటికి తాళం పడింది.
Also Read : వైసీపీ దుష్ప్రచారానికి సుందర్ పిచాయ్ చెక్!
లోకేష్ వ్యాఖ్యలకు రెండు రోజుల తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. పుష్ప సినిమా డైలాగ్లు బాగానే చెబుతున్నారు.. పుష్ప ఎర్రచందనం కూలి.. లోకేష్ 5 కోట్ల మంది ప్రజలకు కూలి అని వ్యాఖ్యానించారు. మీ కొలంబో బోర్డింగ్ పాస్ వివరాలు చెప్పాలని.. ఆ టికెట్ ఎవరి డబ్బులతో కొన్నారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా యాస, పుష్ప సినిమా డైలాగులను పేర్ని కాపీ కొట్టారు. మీ అకౌంట్ నుంచా లేక కుటుంబ సభ్యుల అకౌంట్ నుంచి టికెట్ కొన్నారా అనే వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇక యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. “సిండికెట్ నడిపేటోడికి సొంతం అంటూ ఏముండదు కేశవా.. అంతా పక్కనోడు ఇచ్చే ‘కమిషన్’ మీదే కదా బతుకు! ఆ దుడ్లు చూసుకునే కదా ఇంతలా పులిపిక్కిపోతాండావు?.. అయిన కేశవా.. మేం అడిగిందేంది? నువ్వు సెప్పేదేంది? ఇందాపూర్ హెరిటేజ్ మధ్యున్న లింక్ కదా అడిగింది? అట్టా టాపిక్ డైవర్ట్ చేస్తే ఎవడూ నమ్మరు నాయనా, బిన్నే అసలు విషయం సెప్పు! ఈ టైమ్ లో ఇందాపూర్ గురించి సెప్పకుండ మ్యాచ్, క్యాచ్ అంటూ కతలు చెప్తాండావు.. ఈ ట్వీట్ చూస్తే నీ బుర్రలో గుజ్జు ఉందా లేక గంగమ్మ గుడికాడ కొట్టిన కొబ్బరి నీళ్లు ఉండాయా? అనే అనుమానం వత్తాంది జనాలకి… VSR Ventures కంపెని Learjet విమానం 20 నెలలుగా ఎక్కి యాడికి ఎగిరిపోతాండావో అందరికీ తెల్సులే కానీ ఆ దుడ్లు వివరాలు సెప్పే ధైర్యం ఉందా నీకు?..” అంటూ పోస్ట్ చేశారు.
Also Read : బొత్సకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!
జగన్, చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ పై ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్ ప్రయాణాలంటూ గతంలో కూడా ఆరోపణలు చేస్తే.. దాని వివరాలను లోకేష్ బయటపెట్టారని గుర్తు చేశారు. మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూతురు కోసం లండన్ పర్యటన బిల్లు ఏ అకౌంట్ నుంచో వైసీపీ నేతలు చెప్పాలన్నారు. విజయవాడ నుంచి తిరుపతికి హైదరాబాద్ మీదుగా స్పెషల్ ఫ్లైట్లో ఎందుకు వెళ్లారో జగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లి నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని తెనాలి వరకు కూడా హెలికాఫ్టర్లో వెళ్లిన జగన్.. ఆ బిల్లు వివరాలు వెల్లడించాలంటున్నారు.

