నేటి కాలంలో పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిని సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అత్యంత అవసరమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా మితిమీరిన వాడకం వల్ల పిల్లల్లో సహజంగా ఉండాల్సిన సృజనాత్మకత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు అవసరమైన పటిష్టమైన చట్టాన్ని త్వరలోనే రూపొందిస్తామని తెలిపారు.
Also Read : ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!
ముఖ్యంగా 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేయకుండా.. నియంత్రించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. 13 నుండి 16 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి గ్రేడెడ్ యాక్సెస్ విధానాన్ని పరిశీలిస్తున్నారు. దీని ద్వారా వారికి కేవలం వయస్సుకు సరిపోయే, సురక్షితమైన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా వడపోత ఉంటుంది. వయస్సు నిర్ధారణ కోసం డిజీలాకర్ ఆధారిత ఏజ్ టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read : ఢిల్లీ వెలుపల మరో భారీ పవర్ సెంటర్ గా ‘అమరావతి’
కేవలం చట్టాలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పాఠశాలల్లో నిర్వహించే నో బ్యాగ్ డే రోజున విద్యార్థులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలు, సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తారు. అలాగే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా డిజిటల్ భద్రతపై పౌరుల్లో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియా వేదికగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిని ఎంతమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి లోకేష్ హెచ్చరించారు. అటువంటి వారిపై ఉక్కుపాదం మోపి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి మెటా, గూగుల్, ఎక్స్, స్నాప్చాట్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

