ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ నేడు సిట్ విచారణకు హాజరుకానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణ తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారా..? లేదా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి, మృతదేహాన్ని బాధితుడి ఇంటికే డోర్ డెలివరీ చేసిన ఈ ఘటనలో అనంతబాబు ప్రధాన నిందితుడు, అయితే, ఈ హత్య వెనుక మరియు సాక్ష్యాల తారుమారులో ఆయన భార్య లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉందని సిట్ గుర్తించింది.
Also Read : బీఆర్ఎస్ కు గంపెడు కష్టాలు.. ఏమైనా బయటపడుతుందా..?
అందుకే ఆమెను ఈ కేసులో రెండో నిందితురాలిగా చేరుస్తూ అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. తనపై జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్ ను కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు షరతులతో కూడిన ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 30 వరకు విచారణాధికారి మనీశ్ పాటిల్ ముందు హాజరుకావాలని, ఆ తర్వాత 30వ తేదీన నేరుగా కోర్టులోనే విచారణకు రావాలని స్పష్టం చేసింది. సాధారణంగా విచారణలో నిందితులు సహకరించకపోయినా లేదా బలమైన సాక్ష్యాలు దొరికినా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
Also Read : విజయ్ కొడుకు జాసన్ సంజయ్ షాకింగ్ నిర్ణయం
కోర్టు ఆదేశాల ప్రకారం ఆమె విచారణకు వస్తున్నారు కాబట్టి, విచారణ పూర్తయ్యే వరకు తక్షణ అరెస్టు ఉండకపోవచ్చనే మాట వినపడుతోంది. ఒకవేళ విచారణలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పినా, లేదా సిట్ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తే, కోర్టు అనుమతితో అరెస్ట్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు న్యాయ నిపుణులు. ఆమె విచారణకు హాజరు కానున్న నేపధ్యంలో ఎస్ డీ పీ వో కార్యాలయం వద్ద నేడు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ హత్య జరిగినప్పటి నుండి బాధితుడి కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ఎమ్మెల్సీ భార్యను కూడా నిందితురాలిగా చేర్చడం ద్వారా చట్టం తన పని తాను చేసుకుపోతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి విచారణలో ఆమె ఏయే సమాధానాలు చెప్తారో చూడాలి.

