ఏపీ రాజకీయాలు వాడీ వేడిగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేసిన అధికారులకు వెన్నులో వణుకు మొదలైందనే చెప్పాలి. నాటి జగన్ సర్కార్లో ప్రభుత్వ పెద్దల అండతో చాలా మంది అధికారులు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులతో పాటు నాటి ప్రభుత్వానికి, జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే.. వారిపై అక్రమ కేసులు బనాయించడం.. అరెస్టులు చేయడం.. టార్చర్ పెట్టడం.. ఇంకా కొంతమంది అయితే హత్యాయత్నం కూడా చేశారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు సస్పెన్షన్కు గురైన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే పీవీ సునీల్ కుమార్ను సీఐడీ చీఫ్గా అపాయింట్ చేశారని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు.
Also Read : ప్రక్షాళన దిశగా వైసీపీ.. టార్గెట్ ఫిక్స్..!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి, సీఎంఓ ప్రత్యేక అధికారిగా పని చేసిన ప్రవీణ్ ప్రకాష్, జవహర్ రెడ్డి, శ్రీలక్ష్మి, ఐపీఎస్ అధికారులు అమ్మిరెడ్డి, పీవీ సునీల్ కుమార్ సహా పలువురు అధికారులు నాటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. పార్టీ పెద్దలు చెప్పినట్లుగా వ్యవహరించారని.. తెలుగుదేశం అనే మాట వింటే చాలు.. అగ్గి మీద గుగ్గిలం అయ్యేవారని నాడు టీడీపీ నేతలు ఆరోపించారు. ఇక పీవీ సునీల్ కుమార్ పైన అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు.. ఎంపీగా ఉన్న సమయంలో జగన్కు వ్యతిరేకంగా మాట్లాడారు అనే కారణంగా.. ఆయనను హైదరాబాద్ అక్రమంగా అరెస్టు చేసి.. గుంటూరు తరలించారు. ఆ తర్వాత కస్టడీలో ఆర్ఆర్ఆర్ పై హత్యాయత్నం చేశారనేది సునీల్ కుమార్పై ప్రధాన ఆరోపణ. దీంతో సునీల్ కుమార్పై చర్యలు తీసుకోవాలని తొలి నుంచి రఘురామ డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రఘురామ ఆరోపించారు. కుల సమావేశాలు పెట్టి కాపులకు సీఎం పోస్టు.. దళితులకు డిప్యూటీ సీఎం పోస్టు అని పంపకాలు చేస్తున్నారన్నారు. ఇవి సర్వీస్ రూల్స్ అతిక్రమించినట్లుగా ఆరోపించిన రఘురామ.. వెంటనే సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా రఘురామ లేఖ రాశారు.
Also Read : టార్గెట్ ఫిక్స్ అంటున్న గులాబీ బాస్..!
ఈ నెల నాలుగో తేదీన రఘురామను కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో పీవీ సునీల్ కుమార్ సెట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ లూపే కుల రాజకీయాలు ప్రారంభించారు. కాపులు, దళితులు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో వైసీపీలో చేరి.. ఎన్నికల నాటికి మరింత బలోపేతం అయ్యేలా సునీల్ కుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల పాటు సమయం ఉంది కాబట్టి.. ఈ లోపు పోటీ చేసేందుకు, ప్రచారానికి అవకాశం ఉంటుందని సునీల్ భావిస్తున్నారు.

