అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గత జగన్ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆడిన క్రిమినల్ గేమ్ ఇప్పుడు రివర్స్ అయింది. టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలపై నమోదు చేసిన కేసుల విషయంలో హైకోర్టు ఆళ్ల రామకృష్ణా రెడ్డితో పాటు సిఐడి ని ఉతికి ఆరేసింది. అసలు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే, దానిపై క్రిమినల్ కేసు ఎలా పెడతారంటూ కోర్టు వేసిన ప్రశ్నలకు సిఐడి అధికారులు నీళ్లు నమిలారు.
Also read : జగన్ ఉంటే చాలు శత్రువులు అవసరం లేదు..!
జగన్ ప్రభుత్వ హయాంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సిఐడి పోలీసులు చంద్రబాబు, నారాయణలపై కేసు నమోదు చేశారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నది ఆళ్ల ఆరోపణ. అయితే, ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం జరిగిన విచారణలో జస్టిస్ వై.లక్ష్మణరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం సిఐడి తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వం జీవో జారీ చేస్తే, దానిపై అభ్యంతరం ఉంటే కోర్టుల్లో సవాల్ చేయాలి కానీ..నేరుగా క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారని నిలదీసింది. అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదు చేయగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అదనపు డిజి ఎలా ఆదేశిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు దర్యాప్తు సంస్థకు ఆ అధికారం ఎక్కడుందని కోర్టు ప్రశ్నించింది.
Also read : ఏపీకి పండగొచ్చింది.. బాబు సర్కార్ ఉగాది వరాలు
ఈ కేసు నమోదుకు ముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా..? అప్పుడు అదనపు డీజీగా ఉన్నది ఎవరు..? ఆయన సర్వీసులో ఉన్నారా లేదా రిటైర్ అయ్యారా అని ఆరా తీసింది. రాజకీయ కక్షతో ఎమ్మెల్యే ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదును పట్టుకుని, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా కేసులు నమోదు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఏ ప్రాతిపదికన ఈ కేసు నమోదు చేశారో పూర్తి వివరాలు వెంటనే తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
ఈ కేసులో వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని సిఐడి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయాజి కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. మొత్తంగా హైకోర్టు కామెంట్స్తో ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కలు కనిపించాయి.

