వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వారు ఇప్పుడు తమపై వచ్చిన ఆరోపణలను దాటవేసేందుకు ఇతరులపై నిందలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజం బయటకు రావడం కంటే, ఆ నిజాన్ని పాతిపెట్టడానికి ఎవరెవరు ఎలా ప్రయత్నించారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన 7వ వర్ధంతి సందర్భంగా కుమార్తె సునీత గారు వ్యక్తం చేసిన ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలించింది.
Also Read : గిల్ కు అవార్డు.. రగిలిపోతున్న రోకో ఫ్యాన్స్..!
తండ్రిని కోల్పోయిన బాధతో పాటు, ఏడేళ్లుగా న్యాయం కోసం ఆమె పడుతున్న పోరాటం హృదయ విదారకం అన్నారు. ఒక ఆడబిడ్డ అంతలా విలపిస్తుంటే, కనీసం స్పందించకపోగా.. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టించడం జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం. అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ కాబట్టే, ఇప్పటికీ అబద్ధాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.
రక్త చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం
హత్య జరిగిన రోజు మార్చి 15న ఉదయం ‘గుండెపోటు’ అని ప్రచారం చేశారు. ఆ తర్వాత ‘రక్తపు వాంతులు’ అన్నారు, చివరకు గొడ్డలితో చంపారని తేలింది. సొంత బాబాయిని అంత క్రూరంగా చంపితే, నిందితులను పట్టుకోవాల్సింది పోయి వారిని కాపాడటానికి జగన్ ప్రభుత్వం తాపత్రయపడింది. గూగుల్ టేకవుట్ ఆధారాల ద్వారా ఎవరెవరు ఎప్పుడు ఫోన్ చేశారు, అక్కడ ఏం జరిగిందనేది స్పష్టంగా బయటపడింది. సాక్ష్యాధారాలు తుడవాలని చూసిన వారు, గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందితో కుట్లు వేయించిన వారు.. నేడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదం.
Also Read : హైదరాబాద్ లో బార్లు, రెస్టారెంట్ లలో చికెన్ తింటున్నారా..?
అధికారాన్ని అడ్డుపెట్టుకొని నిందితుల రక్షణ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరిన జగన్, ముఖ్యమంత్రి కాగానే ఆ విచారణ వద్దు అని అడ్డుతగిలారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారులు కర్నూలుకు వెళ్తే, బాంబులు వేస్తామని బెదిరించిన సంస్కృతి వీరిది. సొంత సోదరి సునీతపై లేనిపోని అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ, ఆస్తి తగాదాలంటూ తప్పుడు కథనాలు అల్లారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి బాబాయి హత్యకు న్యాయం చేయలేకపోయిన వ్యక్తి, ఇప్పుడు ఆడబిడ్డల మీద బురద చల్లడం దారుణం.
ప్రజలకు దూరమైన నేత
జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద గానీ, కుటుంబ సభ్యుల మీద గానీ కనీస ప్రేమ లేదు. కేవలం దోచుకున్న సొమ్మును కాపాడే వారి కోసమే ఆయన తాపత్రయం. ప్రజల మధ్యకు వెళ్లకుండా, కేవలం పెళ్లిళ్లలో బలప్రదర్శన చేస్తూ కాలం గడుపుతున్నారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. కానీ, ప్రజలు అన్నీ గమనించే 2024 ఎన్నికల్లో ఆయనకు 11 సీట్లే ఇచ్చి తగిన బుద్ధి చెప్పారు.
Also Read : ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి..? ఎగ్జిట్ ప్లాన్ రెడీ చేసాడా..?
న్యాయం గెలుస్తుంది – చట్టం తన పని తాను చేస్తుంది
ప్రస్తుత కూటమి ప్రభుత్వం చట్టానికి లోబడి పనిచేస్తుంది. వివేకా హత్య కేసులో సునీతమ్మకు త్వరలోనే న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పెట్టుబడులు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శ్రమిస్తుంటే, వైసీపీ నాయకులు మాత్రం రౌడీయిజం, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా వైసీపీ గుండాలు చిల్లర వేషాలు వేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

