దేశవాళి క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే విజయ్ హజారే ట్రోఫీ ఈ సీజన్లో రికార్డుల మోతతో మార్మోగుతోంది. వేగవంతమైన సెంచరీలు, అత్యధిక పరుగులు, వరుస సెంచరీలు, వికెట్ల పరంగా ఒకదాని తరువాత ఒకటి రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్కు చెందిన యువ క్రికెటర్ అమన్ రావు తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు.
Also Read : 5 వేల కిలోమీటర్లు..? జగన్ సరికొత్త ప్లానింగ్..?
మంగళవారం రాజ్కోట్ వేదికగా బెంగాల్తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన అమన్ రావు, అజేయంగా 200 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. కరీంనగర్కు చెందిన ఈ 21 ఏళ్ల యువ ఆటగాడు 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. చివరికి సిక్సర్తోనే 200 పరుగుల మార్క్ను చేరుకోవడం అభిమానులను ఉర్రూతలూగించింది. మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్ వంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న బౌలర్లపై కూడా అమన్ ఎలాంటి భయం లేకుండా దూకుడుగా బ్యాటింగ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతని ఇన్నింగ్స్పై క్రికెట్ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : పరకామణిలో దొంగలు ఈ పోలీసులేనా..?
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అమన్ రావును రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. విజయ్ హజారే ట్రోఫీలో అతను ప్రదర్శిస్తున్న ఫామ్ ఆ పెట్టుబడికి సరైన న్యాయం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాలోని విస్కాన్సిన్లో జన్మించిన అమన్ రావు, హైదరాబాద్లోనే పెరిగి క్రికెట్ శిక్షణ పొందాడు. చిన్న వయసు నుంచే దూకుడు ఆటగాడిగా గుర్తింపు పొందిన అతనికి టీ20 ఫార్మాట్లో 160 స్ట్రైక్ రేట్ ఉండటం విశేషం. అండర్-23 స్టేట్ ట్రోఫీలో ఆరు మ్యాచ్ల్లో 381 పరుగులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.
Also Read : ఆ సీనియర్లకు పదవీ యోగం లేదా..?
అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైపై అర్ధ సెంచరీ నమోదు చేయడంతో పాటు, శార్దూల్ ఠాకూర్పై ఒకే ఓవర్లో 24 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో హైదరాబాద్ తరఫున డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మన్గా అమన్ రావు నిలిచాడు. మొత్తం మీద ఈ టోర్నీలో డబుల్ సెంచరీ చేసిన తొమ్మిదవ బ్యాట్స్మన్గా అతను రికార్డులకెక్కాడు. ఈ ప్రదర్శనతో భారత క్రికెట్లో భవిష్యత్తు స్టార్గా అమన్ రావు పేరు బలంగా వినిపిస్తోంది.

