ప్రజా ప్రతినిధుల జీవితంలో అసెంబ్లీ సమావేశాలు అనేది అత్యంత కీలకమైన అంశం. రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదిక. అసెంబ్లీలో మాట్లాడే మాటల ద్వారా ప్రభుత్వంలో కదలికలు వస్తాయి. క్షేత్రస్థాయిలో పనులు జరిగేందుకు అవకాశం కూడా ఉంటుంది. నిధుల కేటాయింపు, ఉద్యోగాల కల్పన, సాగు తాగునీరు, రైతాంగ సమస్యలు, కార్మికుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, అభివృద్ధి అంశాలు, సంక్షేమంలో లోపాలు, సరికొత్త నిర్ణయాలు, సంస్కరణలకు శ్రీకారం చుట్టడం వంటి అంశాలు ఇక్కడ కీలకంగా ఉంటాయి. అందుకే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం అనేది అత్యంత కీలకమైన విషయం.
Also Read : మంత్రుల మాటకు విలువ ఎక్కడ..?
అయితే 2024లో అధికారం కోల్పోయిన వైసీపీ అప్పటినుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. తనకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా తాము ఎలా ఇస్తామంటూ నిలదీస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. దీనిపై రాజకీయంగా కొంత విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక వైసిపి కార్యకర్తలు సైతం అసెంబ్లీ సమావేశాల విషయంలో కొంత అసంతృప్తిగానే కనపడుతున్నారు.
Also Read : మిథున్ రెడ్డికి గాలం.. రంగంలోకి ఈడి
మీడియా సమావేశాల కంటే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితేనే బాగుంటుందంటూ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు కాబట్టి.. నిధుల కేటాయింపుకు సంబంధించి అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనాలని.. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం దొరుకుతుందని కోరుతున్నారు. జగన్ హాజరు కాకపోవడంతో ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదు. ఇక తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను మీడియాలో కూడా చెప్పలేని పరిస్థితి వైసిపి ఎమ్మెల్యేలది. ఇక జగన్ తో తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని చెప్పాలంటే ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

