2024 నుంచి ప్రజలకు దూరంగా ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలకు దగ్గర కావడానికి అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా పార్టీ బలహీనంగా ఉండటం, నాయకుల ప్రజల్లో తిరగకపోవడం, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటాలు జరగకపోవడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, పార్టీ అధినేత హోదా నుండి కనీస అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం ఇవన్నీ కూడా ఆ పార్టీ క్యాడర్ ఆవేదన కలిగిస్తున్నాయి. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందు కనపడిన నాయకులు ఇప్పుడు కేసులు భయంతో బయటకు రావడం లేదు.
Also Read : దావోస్ మ్యాన్.. చంద్రబాబు ఊహించని గౌరవం..!
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. టిడిపి కార్యకర్తలు గాని జనసేన కార్యకర్తలు గాని పెద్ద ఎత్తున ప్రజల్లో తిరిగారు. నాయకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై గళం విప్పారు. ఇప్పుడు వైసీపీలో అటువంటి పరిస్థితి కనపడటం లేదు. దీంతో జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆరు నెలల పాటు ఆయన ప్రజల్లో తిరుగుతారని నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జగన్ ఏడాది పాటు బస్సుయాత్ర నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని ప్రజల్లో నిలబెట్టాలన్న.. తాను చేయాలనుకుంటున్న పాదయాత్రకు స్పష్టమైన మద్దతు రావాలన్నా బస్సు యాత్ర కీలకమని జగన్ భావిస్తున్నారు.
Also Read : సంతకం పెట్టీ వెళ్ళే ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఫోకస్..!
పార్టీ ప్రక్షాలను కూడా ఇదే సమయంలో చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు అధినేత. కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నా.. వారిని ముందుండి నడిపించే నాయకత్వం లేకపోవడం జగన్ కు ఇబ్బందిగా మారింది. అందుకే జగన్.. బస్సు యాత్ర పేరుతో ప్రజల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. పులివెందుల నుంచి మొదలుపెట్టి.. పలాస వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసేందుకు జగన్ రెడీ అయినట్లు సమాచారం. దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు బస్సు యాత్ర చేసే దిశగా పార్టీ అధిష్టానం రూట్ మ్యాప్ రెడీ చేసింది. అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత దీనిపై జగన్ నిర్ణయం తీసుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

