ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంతో, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకంగా భావిస్తోన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో నౌకలకు రక్షణ కల్పించేందుకు, బ్రిటన్, ఫ్రాన్స్ సహా ఆరు దేశాలు ముందడుగు వేశాయి. మార్చి 19న విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో, ఈ జలసంధి ద్వారా నౌకల సురక్షిత ప్రయాణానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ దేశాలు ప్రకటించాయి.
Also Read : అగార్కర్ పదవీ కాలం పొడిగిస్తారా..?
బ్రిటన్ ప్రధాన మంత్రి కియర్ స్టార్మర్ కార్యాలయం విడుదల చేసిన ఈ ప్రకటనలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడేందుకు అవసరమైన చర్యలకు తాము సహకరిస్తామని ఈ దేశాలు స్పష్టం చేశాయి. గల్ఫ్ ప్రాంతంలో నిరాయుధ వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులను ఈ దేశాలు తీవ్రంగా ఖండించాయి. గత కొద్ది రోజుల్లోనే సుమారు 10 ఆయిల్ నౌకలు సహా 23 వాణిజ్య నౌకలు దాడులకు గురయ్యాయి.
ఇరాన్ దళాలు హోర్ముజ్ జలసంధిని ఎటువంటి హెచ్చరికలు లేకుండా మూసివేయడం వల్ల ప్రపంచ చమురు సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. దీనిని అరికట్టేందుకు వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ తీసుకున్న నిర్ణయానికి కూడా ఈ దేశాలు మద్దతు తెలిపాయి. నౌకాయానానికి ఆటంకం కలిగించడం అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు అంటూ ఈ దేశాలు పేర్కొన్నాయి.
Also Read : భారత్ లో గ్యాస్ కొరత తీవ్రం కానుందా..?
మైనింగ్, డ్రోన్, మిస్సైల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817కు కట్టుబడి ఉండాలని ఇరాన్ ను డిమాండ్ చేశాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. భారత్ వంటి దేశాలకు ఇది చాలా కీలకం. అయితే, ఇటీవల భారత్కు చెందిన కొన్ని ఎల్పీజీ ట్యాంకర్లను ఇరాన్ అనుమతించడం గమనార్హం.

