చట్టం అందరికీ సమానమే. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.. ఈ మాటలు తరచూ వింటూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే.. ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాట ఇదే. ఇక సినిమాల్లో కూడా ఇదే మాట పదే పదే చెప్తారు. దేశమంతా ఒకే చట్టం అమలులో ఉంది. కానీ న్యాయం మాత్రం.. ఒక రాష్ట్రంలో ఒకలా.. మరో రాష్ట్రంలో మరోలా అమలు అవుతోంది. ఇదే మాట ఇప్పుడు మరోసారి రుజువైంది.
Also Read : ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం..!
కోవిడ్ సమయంలో మొబైల్ షాప్ తెరిచారనే ఒకే ఒక్క కారణంతో తండ్రి కొడుకులను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి, కస్టోడియల్ టార్చర్ చేసి చంపిన కేసులో.. తమిళనాడులోని మధురై కోర్టు 9 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. అలాగే బాధితులతోనే రక్తం మరకలు తుడిపించారని కూడా సీబీఐ కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో ఈ కేసులో తండ్రి కొడుకుల మృతికి కారణమైన మొత్తం పది మంది పోలీసులను మధురై కోర్టు దోషులుగా గుర్తించింది. ఇందులో ఒకరు మాత్రం కరోనా వల్ల మృతి చెందారు. దీంతో మిగిలిన 9 మంది పోలీసులకు ఉరి శిక్ష విధిస్తూ మధురై కోర్టు తీర్పు వెల్లడించింది. అదే సమయంలో లాకప్ డెత్లో కుటుంబాన్ని కోల్పోయిన మహిళలకు రూ.1.40 కోట్లు పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. నిందితులు పరిహారం చెల్లించడంలో విఫలమైతే, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి, ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తమిళనాడు పోలీసులు వ్యవహరించిన మాదిరిగానే ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మంది పోలీసులు వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే.. అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించారు. నిందితులకు వత్తాసు పలికారు. వైసీపీ నేతలు చెప్పినట్లుగా ఆడారు. బాధితులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని తెలిస్తే చాలు.. వాళ్లను చిత్రహింసలు పెట్టి నరకం చూపించారు. చివరికి నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఏకైక కారణంతోనే నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్సీకర్ రఘురామ కృష్ణరాజును కూడా కస్టోడియల్ టార్చర్కు గురి చేశారు కొందరు వైసీపీ అభిమాన పోలీసులు.
Also Read : ఇరాన్ లో ఏం జరుగుతోంది..? అపస్మారక స్థితిలో సుప్రీం లీడర్..?
కోవిడ్ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చాడనే కారణంతో.. ఎలిచర్ల కిరణ్ అనే దళిత కుర్రాడిని పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి కొట్టి చంపారు. తర్వాత జీపులో నుండి దూకి చచ్చిపోయాడని కేసు మూసేశారు. ఇక కరోనా డ్యూటీలో ఉన్న మా వైద్యులకు మాస్కులు ఎందుకు ఇవ్వడం లేదు.. అని అడిగిన పాపానికే.. ఒక దళిత డాక్టర్ సుధాకర్ను రోడ్డు మీద బట్టలిప్పి కొట్టుకుంటూ తీసుకెళ్లారు. పిచ్చాసుపత్రిలో చేర్చి కరెంటు షాకులు పెట్టించారు. ఆ దెబ్బలకు కోలుకోలేని డాక్టర్ సుధాకర్ కొన్నాళ్లకు గుండెపోటుతో చనిపోయారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. టీడీపీ కార్యాలయ సిబ్బంది దారపునేని నరేంద్రను కస్టోడియల్ టార్చర్ చేశారు నాటి సీఐడీ అధికారులు. అమరావతికి మద్దతుగా పాదయాత్ర చేస్తున్న మహిళలను జుట్టు పట్టుకుని మరీ కొట్టారు. నెల్లూరులో బీజేపీ నేతను బూటు కాళ్లతో తన్నారు. చివరికి మీడియా ప్రతినిధులను కూడా వైసీపీ నేతలు తన్నినట్లు కేసు పెడితే.. పోలీసులు మాత్రం.. అది నిజం కాదు.. మీడియా వాళ్లే వైసీపీ నేతలను రెచ్చగొట్టారని రివర్స్ కేసు పెట్టారు.
నిజానికి అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా దళిత మహిళే. అయినా.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నడిరోడ్డు మీద టీడీపీ బీసీ నేత చంద్రయ్యను పట్టపగలు గొంతు కోసి హత్య చేస్తే.. ఆ కేసులో నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తమిళనాడు పోలీసులకు ఓ న్యాయం.. ఏపీ పోలీసులకు ఓ న్యాయమా అని ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. నాటి కేసులను తిరిగి విచారిస్తే.. అసలు నిందితులు బయటకు వస్తారని బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

