గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఘాటైన పదజాలంతో ప్రతిస్పందించారు. నేడు గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రత్యర్థుల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, ఈ విషయంలో వాస్తవాలు బయటపడేందుకు వారం రోజుల పాటు ఓపిక పట్టాలని, ఆ తర్వాత అన్ని విషయాలను ఆధారాలతో సహా మాట్లాడతామని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడిని దూషించి, తర్వాత ‘నేను అలా అనలేదు, ఫ్లోలో వచ్చింది’ అంటూ అంబటి మాట మార్చడం హాస్యాస్పదమని ఆమె మండిపడ్డారు.
Also Read : సింఘాల్ సరే.. తర్వాత వారి సంగతేంటి..?
కార్యకర్తలను తాను రెచ్చగొట్టానని అంటున్నారని, దానికి సరైన ఆధారాలు ఏవని మాధవి ప్రశ్నించారు. తాను నిజంగా దాడులకు పాల్పించాలని అనుకుంటే, వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై చేసిన విధంగానే చేయించలేదా అని నిలదీశారు. పెమ్మసాని భార్యను రాజకీయాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ, ఈ ఘటనకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు ఆమె ఎందుకు సమాధానం చెప్పాలన్నారు. మహిళలపై దాడుల గురించి మాట్లాడుతున్న అంబటి కుమార్తె, తమ మహిళా కార్యకర్తపై వైసీపీ కార్యాలయం వద్ద దాడి జరిగినప్పుడు తన తండ్రిని ఎందుకు ప్రశ్నించలేదని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read : తలోదారి అయిపోయిన టీడీపీ సోషల్ మీడియా క్యాడర్..!
ఇదే సందర్భంలో కుల రాజకీయాలపై కూడా మాధవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు కులం గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రం కులాన్ని ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించారు. మేము మాట్లాడితే రెచ్చగొట్టినట్టుగా, మీరు మాట్లాడితే ప్రశ్నించినట్టుగా ఎందుకు చిత్రీకరిస్తారని ఆమె మండిపడ్డారు. జక్కంపూడి రాజా అధికారంలోకి వచ్చాక జుట్టు పట్టుకుని బయటకు లాగుతామని మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తూ, గుంటూరు పశ్చిమలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఈ వ్యాఖ్యలని ఆరోపించారు.
Also Read : ట్రంప్ కు మోడీ థాంక్స్.. దారిలోకి తెచ్చుకున్నాడా..?
చివరగా మాధవి వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే ఈ నెల 11న మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని, అక్కడే అన్ని విషయాలు తేల్చుకుందామని చెప్పారు. 2029 వరకు ఎందుకు వాయిదా వేయాలని ప్రశ్నించారు. తమ ఎంపీని, తనను ‘డమ్మీలు’ అని అన్నా భరించామని, కానీ ముఖ్యమంత్రిని దూషిస్తే క్షమాపణ అడగడంలో తప్పేముందని స్పష్టంగా నిలదీశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, కానీ హద్దులు దాటితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆమె హెచ్చరించారు.

