సాధారణంగా రాజకీయాల్లో పార్టీ అధిష్టానాలను నాయకులు వాడుకుంటూనే ఉంటారు. అవినీతి కార్యక్రమాలు చేసిన సమయంలో వారి పేరు వాడుతూ.. పాపం తమది పుణ్యం వాళ్లదే అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు టిడిపిలో ఈ రాజకీయం ఎక్కువగా నడుస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో భారత రాష్ట్ర సమితిలో కనపడిన ఈ సంస్కృతి క్రమంగా టిడిపిలో పెరిగిపోతుంది. కోస్తా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇటీవల కాలంలో ఇసుకతో పాటుగా సహజ వనరుల దోపిడీకి పెద్ద ఎత్తున పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి స్థానిక నాయకత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది.
Also Read : అమరావతి: ‘కలల రాజధాని’ నుంచి ‘క్రియేటివ్ క్యాపిటల్’ వైపు
దీనిపై అధిష్టానం కూడా పలు సందర్భాల్లో నాయకులకు వార్నింగ్ ఇచ్చింది. అయితే స్థానిక నాయకులు వెళ్లి మాట్లాడిన సమయంలో.. ఓ ప్రజా ప్రతినిధి గారు చెప్పిన సమాధానం విని స్థానిక నాయకులు షాక్ అయ్యారు. ఇదంతా లోకేష్ గారి కోసమేనని.. తామేమి సంపాదించుకోవడంలేదని చెప్పే ప్రయత్నం చేశారట. ఇదే మాట ఢిల్లీలో కూడా సదరు ప్రజాప్రతినిధి వాడారు. జిల్లా నాయకులతో సమావేశమైన సందర్భంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేల వద్ద కూడా ఇదేవిధంగా ప్రస్తావించారట. ఇది ఆ నోట ఈ నోట పడి అధిష్టానానికి చేరింది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఓ ఎంపీ గారు ఇలాగే కాస్త నోటి దూల ప్రదర్శించారట. ఈ వ్యవహారం కూడా పార్టీ అధిష్టానానికి చేరింది.
Also Read : ఉవ్వెత్తున ఎగిసిన కెరటం.. జానీ ఈజ్ బ్యాక్..!
వాళ్లు చేసే పాపాల్లో మంత్రి లోకేష్ పేరు వాడటంతో.. పార్టీ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల దర్శనాలు మొదలు.. ఎటువంటి కార్యక్రమంలోనైనా సరే మంత్రి లోకేష్ పేరు వాడినట్లు తమ దృష్టికి వస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అధిష్టానం హెచ్చరించింది. ఇలా పేరు వాడుతున్న దాదాపు 14 మంది ఎమ్మెల్యేలను అధిష్టానం గుర్తించింది. ఒక ముగ్గురు నలుగురు ఎంపీలు కూడా ఇలాగే నోరు జారుతున్నట్లు గుర్తించారు. వాళ్లందరికీ స్వయంగా పార్టీ అధిష్టానం హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. ఇటువంటి ప్రచారాలతో పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని, అక్రమ సంపాదనలో అధిష్టానం పేరు ఎందుకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు గనక పునరావృతం అయితే మాత్రం తదుపరి పరిణామాలకు బాధ్యత వహించాలంటూ హెచ్చరించింది.

