టీమిండియా యాజమాన్యానికి.. సీనియర్ ఆటగాళ్లకు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ల విషయంలో సీనియర్ ఆటగాళ్లు ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు చూస్తూనే ఉన్నాం. జట్టు సెలక్షన్ విషయంలో కెప్టెన్ అభిప్రాయాలు గతంలో తీసుకోకపోవడం, కెప్టెన్సీ మార్పు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం, సరైన ప్రదర్శన చేయని ఆటగాళ్లను జట్టులో కొనసాగించడం.. వంటి అంశాలపై సీనియర్ ఆటగాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
Also Read : ట్రాఫిక్ కష్టాలకు జీహెచ్ఎంసీ ప్లాన్ అదుర్స్
హర్షిత్ రానా విషయంలో కూడా సీనియర్ ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిగిన మొదటి వన్డేలో కూడా బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్లను కేఎల్ రాహుల్ కంటే ముందు పంపడం పై కూడా డ్రెస్సింగ్ రూమ్ లో అసంతృప్తి వ్యక్తం అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : టార్గెట్ ఫిక్స్ అంటున్న గులాబీ బాస్..!
ఈనెల మూడో తారీఖున జరగనున్న రెండో వన్డే కి ముందు సీనియర్ ఆటగాళ్లతో జట్టు యాజమాన్యం భేటీ కానుంది. ఈ సమావేశానికి బీసీసీఐ సెక్రటరీ తో పాటుగా, ఉపాధ్యక్షుడు కూడా హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే చీఫ్ సెలెక్టర్ ఆగర్కర్, కోచ్ గంభీర్ హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, జస్పీత్ బూమ్రా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. 2027 ప్రపంచకప్ ని దృష్టిలో ఉంచుకుని బోర్డు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ఓ మాజీ ఆటగాడు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు భారత క్రికెట్ వర్గాలు తెలిపాయి.

